
సాహా అజేయ సెంచరీ
గాయంతో ఇంగ్లండ్తో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన వృద్ధిమాన్ సాహా తన పునరాగమన మ్యాచ్లో కీలక శతకం
విజయానికి 113 పరుగుల దూరంలో రెస్టాఫ్ ఇండియా
ముంబై: గాయంతో ఇంగ్లండ్తో జరిగిన చివరి మూడు టెస్టులకు దూరమైన వృద్ధిమాన్ సాహా తన పునరాగమన మ్యాచ్లో కీలక శతకం సాధించాడు. పార్థివ్ పటేల్కు పోటీగా తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించి సెలక్టర్ల దృష్టి తనపై పడేలా చేశాడు. సాహా (123 బ్యాటింగ్; 16 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీ కారణంగా... గుజరాత్తో ఇక్కడ జరుగుతున్న ఇరానీ కప్ మ్యాచ్లో రెస్టాఫ్ ఇండియా విజయం దిశగా సాగుతోంది.
379 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెస్ట్ జట్టు నాలుగో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 266 పరుగులు చేసింది. సాహాతో పాటు చతేశ్వర్ పుజారా (83 బ్యాటింగ్; 10 ఫోర్లు) క్రీజ్లో ఉన్నాడు. వీరిద్దరు ఐదో వికెట్కు ఇప్పటికే అభేద్యంగా 203 పరుగులు జోడించారు. చేతిలో ఆరు వికెట్లు ఉన్న రెస్టాఫ్ ఇండియా చివరి రోజు విజయం కోసం మరో 113 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 227/8తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ తమ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది.