సాక్షి, ముంబై : దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరిస్ ఓటమి తర్వాత వన్డే సిరిస్లో భాగంగా కింగ్స్మీడ్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అత్యత్తమ ప్రదర్శన కనబరిచారని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనలతో ముంచెత్తారు. కోహ్లి, రహానేల కీలక భాగస్వామ్యం భారత్ను విజయతీరాలకు చేర్పించిందని కొనియాడారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్, చహల్లు రాణిస్తే, కోహ్లి, రహానేలు బ్యాటింగ్లో సత్తా చాటారని పేర్కొన్నారు. బాగా ఆడారు, ఇలాగే విజయాల పరంపరను కొనసాగించండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
తొలి మ్యాచ్లో భారత్ 6 వికెట్లతో దక్షిణాఫ్రికాని చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (112 బంతుల్లో 120; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. కుల్దీప్ 3, చహల్ 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరు 20 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయడం సఫారీల పతనాన్ని శాసించింది. అనంతరం భారత్ 45.3 ఓవర్లలో 4 వికెట్లకు 270 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ కోహ్లి (119 బంతుల్లో 112; 10 ఫోర్లు) వన్డేల్లో 33వ శతకం సాధించగా... అజింక్య రహానే (86 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వన్డే సిరిస్లో భారత్ 1–0తో ముందంజలో నిలవగా... ఆదివారం సెంచూరియన్లో రెండో వన్డే జరుగుతుంది.