కోహ్లి మిస్‌.. రోహిత్‌కు ఛాన్స్‌ | Rohit Sharma Register Most 50-Plus Scores in T20Is | Sakshi
Sakshi News home page

కోహ్లికి రెస్ట్‌.. రోహిత్‌కు ఛాన్స్‌

Feb 3 2020 9:11 AM | Updated on Feb 3 2020 10:56 AM

Rohit Sharma Register Most 50-Plus Scores in T20Is - Sakshi

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ప్రపంచ రికార్డు సాధించాడు.

మౌంట్‌మాంగనీ: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ప్రపంచ రికార్డు సాధించాడు. టి20ల్లో అత్యధికసార్లు 50 అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 సార్లు అతడీ ఘనత సాధించాడు. దీంతో విరాట్‌ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన 5వ టి20లో రోహిత్‌ శర్మ 60 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకోవడంతో అతడి పేరిట ఉన్న రికార్డును తన పేరిట లిఖించుకునే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

ఇప్పటివరకు 108 టి20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ నాలుగు సెంచరీలు, 21 అర్ధశతకాలతో 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన వారిలో అందరికంటే ముందున్నాడు. కోహ్లి 24 అర్ధశతకాలు సాధించాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు 82 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్టిల్‌, ఐర్లాండ్‌కు చెందిన పాల్‌ స్టిర్లింగ్‌ 17 సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేశారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 16 సార్లు ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

పరుగుల పరంగా చూస్తే రోహిత్‌ కంటే కోహ్లి ముందున్నాడు. కోహ్లి 50.80 సగటుతో 2794 పరుగులు సాధించాడు. రోహిత్ ‌32.62 సగటుతో 2773 పరుగులు చేశాడు. కోహ్లికి 21 పరుగుల దూరంలో నిలిచాడు. కొంతకాలంగా వీరిద్దరూ ‘టాప్‌’ ప్లేస్‌ కోసం పోటీ పడుతున్నారు. ఐపీఎల్‌ ముగిసే వరకు టి20 అంతర్జాతీయ సిరీస్‌లు లేనందున అప్పటివరకు కోహ్లి టాప్‌లో కొనసాగనున్నాడు. (చదవండి: టీమిండియా క్లీన్‌స్వీప్‌)

Advertisement
 
Advertisement
Advertisement