గావస్కర్‌ తర్వాత రో‘హిట్‌’

Rohit Becomes Second Indian Most Ceneturies By An Opener - Sakshi

రాంచీ: అసలు టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ రాణిస్తాడా..అనేది దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌లో ప్రశ్న.  ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రోహిత్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుంది. అయితే రోహిత్‌  శర్మ వాటిని అన్నింటిని పటాపంచలు చేస్తూ రికార్డులు కొల్లగొడుతున్నాడు. కొద్దిపాటు టెక్నిక్‌ను సవరించుకున్న రోహిత్‌ శర్మ.. టెస్టుల్లో కూడా ఓపెనర్‌గా సత్తాచాటుకోవడం ఈజీనేనని చాటి చెప్పాడు. సఫారీలతో తొలి టెస్టులో రెండు శతకాలు సాధించి ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన మ్యాచ్‌లో ఆ ఫీట్‌ సాధించిన రికార్డును తన పేరిట లిఖించుకున్న రోహిత్‌.. ఓపెనర్‌గా దిగిన తొలి టెస్టులో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును కూడా సాధించాడు. తాజాగా మూడో టెస్టు మ్యాచ్‌ ద్వారా మరికొన్ని ఘనతలు సాధించాడు రోహిత్‌. మూడో టెస్టులో సెంచరీ సాధించిన క్రమంలో ఒక్క సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గతంలో వెస్టిండీస్‌ ఆటగాడు హెట్‌మెయిర్‌ ఒక సిరీస్‌లో 15  సిక్సర్లు సాధిస్తే దాన్ని బ్రేక్‌ చేశాడు.

కాగా, ఒక సిరీస్‌లో భారత్‌ తరుఫున అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తర్వాత ఎక్కువ శతకాలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గావస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాలు సాధించాడు. 1977-78లో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన గావస్కర్‌.. 1978-79 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నాలుగు శతకాలు నమోదు చేశాడు. అంతకుముందు 1970-71 సీజన్‌లో కూడా విండీస్‌పైనే ఒక్క సిరీస్‌లో గావస్కర్‌ నాలుగు సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఒక సిరీస్‌లో కనీసం మూడు సెంచరీలు సాధించిన భారత ఓపెనర్ల జాబితాలో రోహిత్‌ శర్మ చేరిపోయాడు. ఫలితంగా గావస్కర్‌ తర్వాత ఆ మార్కును చేరిన ఆటగాడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top