అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌

Rohit 2nd Indian After Kohli to Hit World Cup Century Against Pak - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ సాధించాడు. పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేస్తూ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం నమోదు చేశాడు. ఇది రోహిత్‌కు వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ కాగా, ఈ వరల్డ్‌కప్‌లో రెండోది. ఆది నుంచి ఏమాత్రం తడబడకుండా సెంచరీ మార్కును చేరాడు. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత కాస్త నెమ్మదించాడు. అర్థ శతకం సాధించడానికి 34 బంతులు మాత్రమే ఆడిన రోహిత్‌.. దాన్ని సెంచరీ మలుచుకోవడానికి మరో 51 బంతులు తీసుకున్నాడు. ఇది రోహిత్‌కు ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో మూడో సెంచరీ. ఇదిలా ఉంచితే, పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత నెలకొల్పగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.
(ఇక్కడ చదవండి: పాక్‌పై టీమిండియా సరికొత్త రికార్డు)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్‌(57) పెవిలియన్‌ చేరాడు. రియాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ అజామ్‌కు సునాయసమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే రోహిత్‌-కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరు సమయోచితంగా ఆడటంతో భారత్‌ జట్టు 35 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టానికి 206 పరుగులు చేసింది. 


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top