పాక్‌పై టీమిండియా సరికొత్త రికార్డు

Indias Highest Opening Stand Against Pakistan in World Cup - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమ వరల్డ్‌కప్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై అత్యధిక ఓపెనింగ్‌ పరుగుల భాగస్వామ్యాన్ని భారత్‌ సాధించింది.  భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి కొత్త అధ్యాయాన్ని లిఖించారు. గతంలో పాక్‌పై వరల్డ్‌కప్‌లో భారత్‌ అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం 90 కాగా, దాన్ని తాజాగా రోహిత్‌-రాహుల్‌లు బ్రేక్‌ చేశారు. 1996 వరల్డ్‌కప్‌లో సచిన్‌ టెండూల్కర్‌-నవజ్యోత్‌ సిద్ధూలు 90 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే ఇప్పటివరకూ పాక్‌పై వరల్డ్‌కప్‌లో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. దాన్ని 23 ఏళ్ల తర్వాత రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌ సవరించారు. తాజా మ్యాచ్‌లో రోహిత్‌-రాహుల్‌లు కుదురుగా ఆడుతూ భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు.
(ఇక్కడ చదవండి: రోహిత్‌ శర్మ దూకుడు)

ఈ క‍్రమంలోనే రోహిత్‌ శర్మ 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అతనికి రాహుల్‌ నుంచి చక్కటి సహకారం లభించడంతో వంద పరుగుల భాగస్వామ్యం సాధ్యమైంది. 22 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ జట్టు వికెట్‌ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ కూడా హాఫ్‌ సెంచరీ సాధించాడు. టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ముందుగా భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top