బోపన్న టెన్నిస్‌ స్కాలర్‌షిప్స్‌

Rohan Bopanna Started Tennis Scholarship Project - Sakshi

బెంగళూరు: భారత డబుల్స్‌ టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న టెన్నిస్‌ స్కాలర్‌షిప్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు. ఆటతోపాటు చదువు నేర్పే ఈ కార్యక్రమం కోసం ఒక్కో విద్యార్థిపై రూ. 10 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలిసింది. బెంగళూరులోని ‘ద స్పోర్ట్స్‌ స్కూల్‌’ సహ భాగస్వామిగా ఉన్న ఈ ప్రాజెక్టులో అండర్‌–12, 14, 16 విభాగాల్లోని బాలబాలికల ప్రతిభ, అఖిల భారత టెన్నిస్‌ సంఘం ర్యాంకింగ్‌ ఆధారంగా ఒక్కో కేటగిరీలో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి అత్యున్నత టెన్నిస్‌ శిక్షణతో పాటు విద్య కూడా అందజేస్తారు.

ఇది భారత టెన్నిస్‌ను మార్చే కార్యక్రమంగా బోపన్న అభివర్ణించాడు. ప్రపంచంలోనే ఇది గొప్ప ఉపకారవేతనమని చెప్పాడు. 100 శాతం స్కాలర్‌షిప్‌ అందజేస్తామని, అమెరికా టెన్నిస్‌ కాలేజ్‌లో కూడా 70 లేదంటే 80 శాతం మొత్తాన్నే స్కాలర్‌షిప్‌గా అందజేస్తారని... ఇక్కడ మాత్రం పూర్తి మొత్తం ఇస్తామని రోహన్‌ బోపన్న చెప్పాడు. తను జూనియర్‌ స్థాయిలో ఉన్నప్పుడు తనకు అందుబాటులో లేని సౌకర్యాలు, సామాగ్రి ఇప్పుడు శిక్షణ పొందేవాళ్లకు అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top