ఫైనల్లో సింధు, సాయిప్రణీత్‌ | PV sindhu ,B Sai Praneeth storm into Syed Modi International badminton finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సింధు, సాయిప్రణీత్‌

Jan 29 2017 12:41 AM | Updated on Sep 5 2017 2:21 AM

ఫైనల్లో సింధు, సాయిప్రణీత్‌

ఫైనల్లో సింధు, సాయిప్రణీత్‌

సయ్యద్‌ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ సంచలన విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

లక్నో: సయ్యద్‌ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ సంచలన విజయంతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తనకన్నా మెరుగైన ర్యాంకింగ్‌ ఆటగాడు, ఈ టోర్నీలో మూడో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ పూసర్ల వెంకట సింధు టైటిల్‌ పోరుకు అర్హత సంపాదించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఒలింపిక్‌ రజత పతక విజేత సింధు 21–11, 21–19తో నాలుగో సీడ్‌ ఫిత్రియాని ఫిత్రియాని (ఇండోనేసియా)పై అలవోక విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఈ హైదరాబాదీ స్టార్‌ ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కతో తలపడుతుంది.

పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో సాయిప్రణీత్‌ 15–21, 21–10, 21–17తో శ్రీకాంత్‌ను కంగుతినిపించాడు. టైటిల్‌ పోరులో సాయిప్రణీత్‌ భారత్‌కే చెందిన సమీర్‌ వర్మతో తలపడతాడు. సెమీస్‌లో సమీర్‌ 21–15, 21–11తో హర్షిల్‌ డానీపై గెలిచాడు. మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి తుదిపోరుకు సిద్ధమైంది. మహిళల ఈవెంట్‌లో ఆమె అశ్విని పొన్నప్పతో కలిసి 18–21, 21–12, 21–13తో సంజన–ఆరతి సారా జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రాతో జతకట్టిన ఆమె 21–18, 21–13తో క్రిస్టియన్‌సేన్‌–సార తైగెసన్‌ (డెన్మార్క్‌) జంటపై నెగ్గింది. ఫైనల్లో సుమిత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీతో సిక్కి–ప్రణవ్‌ ద్వయం తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement