క్రికెట్‌కు ప్రజ్ఞాన్‌ ఓజా గుడ్‌ బై

Pragyan Ojha Retires From All Forms Of Cricket With Immediate Effect - Sakshi

భువనేశ్వర్‌: టీమిండియా వెటరన్‌ లెఫ్మార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ఓజా ప్రకటించాడు. ఈ మేరకు తన ట్వీటర్‌ అకౌంట్‌లో క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పే విషయాన్ని స్పష్టం చేశాడు. తన కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోవడానికి ఇదే తగిన సమయని పేర్కొన్న ఓజా.. తన కెరీర్‌ ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. వారంతా తనతో పాటు ఎప్పుడూ ఉంటారన్నాడు.  

‘నేను తీసుకున్న వీడ్కోలు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి వైదొలిగే సమయం ఇదేనని భావిస్తున్నాను. భారత క్రికెటర్‌గా ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన అత్యంత గౌరవమన్నాడు. భారత్‌ క్రికెట్‌ జట్టుకు ఆడాలని చిన్నప్పట్నుంచి కలలు కనేవాడినని, అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. భారత్‌ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6  టీ20లు ఆడాడు. టెస్టుల్లో 113 వికెట్లు సాధించిన ఓజా.. వన్డేల్లో 21 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 10 వికెట్లను తీశాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ చార్జర్స్‌, ముంబై  ఇండియన్స్‌ తరఫున ఓజా ఆడాడు. 2014లో ఓజా బౌలింగ్‌ యాక్షన్‌పై అనుమానాలు తలెత్తగా, 2015లో క్లియరెన్స్‌ లభించింది. 2018లో బిహార్‌ తరఫున తన చివరి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు. అప్పట్నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ఓజా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top