సినిమా థియేటర్లలో భారత్-పాక్ లైవ్ మ్యాచ్! | Peshawar to show Pakistan-India match on big screens | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్లలో భారత్-పాక్ లైవ్ మ్యాచ్!

Mar 19 2016 12:56 PM | Updated on Aug 11 2018 8:29 PM

సినిమా థియేటర్లలో భారత్-పాక్ లైవ్ మ్యాచ్! - Sakshi

సినిమా థియేటర్లలో భారత్-పాక్ లైవ్ మ్యాచ్!

భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ఉందంటే ఇక క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్సే.

ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ ఉందంటే ఇక క్రికెట్ అభిమానులకు ఫుల్ మీల్సే. ఇరుదేశాల మధ్య మ్యాచ్ను వీక్షించేందుకు అటు పాక్లోనూ, ఇటు భారత్లోనూ ఎడతెగని ఉత్కంఠంతో ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారు క్రికెట్ ప్రియులు. శనివారం కోల్కతాలో టి20 ప్రపంచ కప్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో భారత్- పాక్ ల మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ను తిలకించేందుకు పాకిస్తాన్లోని పేషావార్ నగరంలో ఏకంగా సినిమా థియేటర్లలో శనివారం లైవ్ మ్యాచ్(ప్రత్యక్ష ప్రసారం)కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు అక్కడి పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు.. 100 (పాకిస్తాన్ కరెన్సీలో) చొప్పున సినిమా థియేటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేస్తున్నట్టు డాన్ ఆన్లైన్ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా యువకులను ఆకర్షించేందుకు సినిమా థియేటర్ల వద్ద పెద్ద సైజులో పోస్టర్లు, బ్యానర్లు పెట్టినట్టు పాక్ వర్గాలు తెలిపాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వేతర సంస్థలు కూడా ప్రజలందరూ భారత్, పాక్ లైవ్ మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్, పాక్ ల మధ్య మ్యాచ్ జరిగిన  సమయంలో కూడా ఈ తరహా ఏర్పాట్లే చేసినట్టు ఓ క్రికెట్ అభిమాని తెలిపాడు. భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఆయా సినిమా థియేటర్లలో అంతరాయం లేకుండా విద్యుత్ తప్పనిసరిగా సరఫరా చేయాలని క్రికెట్ అభిమానులు పాక్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement