క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్‌  | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లంక బౌలర్‌ 

Published Wed, Jul 24 2019 4:17 PM

Nuwan Kulasekara Retires From International Cricket - Sakshi

కొలంబో: శ్రీలంక పేస్‌ బౌలర్‌ నువాన్‌ కులశేఖర అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. తన రిటైర్మెంట్‌ ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుందని లంక క్రికెట్‌ బోర్డుకు తెలిపాడు. ఈ మేరకు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. గత కొన్నేళ్లుగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న కులశేఖర లిస్ట్‌-ఏ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. 2017లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడిన కులశేఖర 2014 టీ20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అదేవిధంగా 2007, 2011 వన్డే ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలిచిన లంక జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. 2008లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ల్లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లోనే కులశేఖర్‌ బౌలింగ్‌లోనే ఎంఎస్‌ ధోని సిక్సర్‌ కొట్టి టీమిండియాకు రెండో సారి కప్‌ను అందించాడు.

వన్డేల్లో 2003లో శ్రీలంక తరుపున ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన కులశేఖర, ఓవరాల్‌గా184 వన్డేల్లో 4.90 ఎకానమీతో 199 వికెట్లు పడగొట్టాడు. 58 టీ20ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో విజవంతమైన ఈ రైటార్మ్‌ పేస్‌ బౌలర్‌ టెస్టుల్లో దారుణంగా విపలమయ్యాడు. కేవలం 21 టెస్టులాడినప్పటికీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 2016లోనే టెస్టులకు వీడ్కోలు పలికాడు. అనంతరం వన్డేల్లోనూ అంతగా ఆకట్టుకోకపోవడంతో 2018 నుంచి లిస్ట్‌-ఏ క్రికెట్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. ఇక తాజాగా శ్రీలంక ప్రపంచకప్‌ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇప్పటికే యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ కూడా బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి వన్డేనే చివరిదని ప్రకటించిన విషయం తెలిసందే. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement