సింగిల్స్ చాంప్ రుత్విక

సింగిల్స్ చాంప్ రుత్విక


చండీగఢ్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు సత్తా చాటుకున్నారు. అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో రుత్విక శివాని... అండర్-19 సింగిల్స్‌లో రీతూపర్ణ దాస్ విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలికల డబుల్స్‌లో తెలుగు అమ్మాయి మేఘన సహచరిణి రీతూపర్ణ దాస్‌తో కలిసి... అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎయిరిండియా ఆటగాడు సాన్యామ్ శుక్లాతో జతగా టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అండర్-17 ఫైనల్లో రెండో సీడ్ రుత్విక 21-19, 21-14తో కరిష్మా వాద్కర్ (మహారాష్ట్ర)ను ఓడించింది. గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రుత్వికకు ‘డబుల్’ సాధించే అవకాశం చేజారింది.

 

  అండర్-19 సింగిల్స్ ఫైనల్లో రుత్విక 14-21, 7-21తో టాప్ సీడ్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రీతూపర్ణ దాస్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. బెంగాల్‌కు చెందిన రీతూపర్ణ దాస్ హైదరాబాద్‌లోని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. అండర్-19 బాలికల డబుల్స్ ఫైనల్లో మేఘన-రీతూపర్ణ దాస్ ద్వయం 17-21, 21-9, 21-12తో వైష్ణవి అయ్యర్ (మహారాష్ట్ర)-రేష్మా కార్తీక్ (ఎయిరిండియా) జోడిపై గెలిచింది. అండర్-19 మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో మేఘన-సాన్యామ్ శుక్లా జంట 21-11, 22-24, 21-7తో సంకీర్త్-మీరా మహాదేవన్ (కర్ణాటక) జోడిని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top