టీ20ల్లో ధోని సరికొత్త రికార్డు | MS Dhoni Smashes Another T20 Record | Sakshi
Sakshi News home page

May 21 2018 2:47 PM | Updated on May 21 2018 2:47 PM

MS Dhoni Smashes Another T20 Record - Sakshi

ఎంఎస్‌ ధోని

పుణే : ఐపీఎల్‌-11 సీజన్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్లో 6వేల పరుగులు క్లబ్‌లో చేరిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందిన ధోని తాజాగా మరో అరుదైన రికార్డును సొం‍తం చేసుకున్నాడు. ఆదివారం కింగ్స్‌పంజాబ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో మూడు క్యాచ్‌ల అందుకున్న ధోని.. టీ20ల్లో (144) అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందాడు. దీంతో శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర(142)ను అధిగమించాడు. 291 టీ20 మ్యాచ్‌ల్లో ధోని ఈ ఘనతను సొంతం చేసుకోగా.. 264 మ్యాచ్‌ల్లోనే సంగక్కర ఈ రికార్డును నమోదు చేశాడు. ఇక తరువాతి స్థానాల్లో మరో భారత వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ (139), కమ్రాన్‌ అ‍క్మల్‌(123), దినేశ్‌ రామ్‌దిన్‌(111)లు ఉన్నారు.

ఐపీఎల్‌లో 7వ బ్యాట్స్‌మన్‌గా..
ఈ మ్యాచ్‌లో 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ధోని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 4,000 పరుగులు పూర్తి చేసిన 7వ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు విరాట్‌ కోహ్లి(4,948), సురేశ్‌ రైనా (4,931), గౌతం గంభీర్‌(4,217), రాబిన్‌ ఉతప్ప(40,81), డేవిడ్‌ వార్నర్‌(4,014)లు ఉండగా.. 4007 పరుగులతో ధోని 7వ స్థానంలో నిలిచాడు. ఇక ఈసీజన్‌లో వీరవిహారం చూపిస్తున్న ధోని 14 మ్యాచ్‌ల్లో 30 సిక్స్‌లు, 23 బౌండరీలతో 446 పరుగులు చేశాడు. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ చెన్నై 5 వికెట్ల తేడాతో నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. రేపు (మంగళవారం) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో చెన్నై ముంబై వేదికగా తొలి క్వాలిఫైర్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement