అశ్విన్‌పై ధోని అభిమానుల ఆగ్రహం | MS Dhoni Fans Fires on R Ashwin | Sakshi
Sakshi News home page

Apr 16 2018 6:25 PM | Updated on Apr 16 2018 6:30 PM

MS Dhoni Fans Fires on R Ashwin - Sakshi

ధోని, అశ్విన్‌ (ఫైల్‌ ఫొటో)

మొహలీ : కింగ్స్‌ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ధోని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ పరుగుల సునామీ సృష్టించగా.. చెన్నై తరఫున ధోని అద్భుతంగా పోరాడాడు. అయితే మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ మాట్లాడుతూ.. తమ బౌలర్లు అద్బుతంగా రాణించారని, రాయుడు వికెట్‌ అనంతరం మ్యాచ్‌పై పట్టు చిక్కిందని తెలిపాడు. ఇక గేల్ ఇన్నింగ్స్‌ సైతం తమ విజయానికి కలిసొచ్చిందని పేర్కొన్నాడు. అయితే అశ్విన్‌ ధోని అద్భుత ప్రదర్శనను ప్రస్తావించకపోవడం అతని అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అదే ధోని మాట్లాడుతూ.. గేల్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. తమ కంటే పంజాబ్‌ ఆటగాళ్లు బాగా ఆడారని, కొన్ని విషయాల్లో తమింకా మెరుగుపడాలని  అభిప్రాయపడ్డాడు.

ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అభిమానులు అశ్విన్‌పై మండిపడుతున్నారు. ధోని ప్రత్యర్థి ఆటగాళ్ల గురించి మాట్లాడినప్పుడు అశ్విన్‌కు ఏమైందని సోషల్‌ మీడియా వేదికగా నిలిదీస్తున్నారు. ధోని గురించి అశ్విన్‌ ఒక్క మాట మాట్లడకపోవడంతో అతనిపై తమకు గౌరవం పోయిందని కొందరంటే.. అసలు ధోని లేకపోతే అశ్విన్‌ ఎక్కడా.. కష్టసమయాల్లో ధోని ఎన్నో సార్లు అశ్విన్‌కు మద్దతిచ్చాడని అలాంటిది ధోని అద్భుత ఇన్నింగ్స్‌ గురించి ఒక్క మాట మాట్లడకపోవడం ఏమిటని ఇంకోందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో వెన్నునొప్పితో బాధపడ్డ ధోని 5 సిక్సులు, 6 ఫోర్లతో 44 బంతుల్లో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి కడదాక పోరాడిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement