చాంపియన్‌ కార్ల్‌సన్‌ | Magnus Carlsen Tata Chess Winner | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ కార్ల్‌సన్‌

Nov 27 2019 5:41 AM | Updated on Nov 27 2019 5:41 AM

Magnus Carlsen Tata Chess Winner - Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా విశ్వవిజేత మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) నిలిచాడు. మొత్తం 27 పాయింట్లతో అతను అగ్రస్థానాన్ని అలంకరించాడు. కార్ల్‌సన్‌కు 37,500 డాలర్లు  (రూ. 26 లక్షల 81 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 23 పాయింట్లతో హికారు నకముర (అమెరికా) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 18.5 పాయింట్లతో సో వెస్లీ (అమెరికా), అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... సో వెస్లీకి మూడో స్థానం, అనీశ్‌కు నాలుగో స్థానం లభించాయి.

భారత గ్రాండ్‌మాస్టర్లు విశ్వనాథన్‌ ఆనంద్‌ (16 పాయింట్లు) ఏడో స్థానంలో, పెంటేల హరికృష్ణ (14.5 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో, విదిత్‌ సంతోష్‌ గుజరాతి (14.5 పాయింట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచారు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగమైన ఈ టోర్నీలో పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు తొలుత ర్యాపిడ్‌ విభాగంలో, ఆ తర్వాత బ్లిట్జ్‌ విభాగంలో పాల్గొన్నారు.  నిర్ణిత ఏడు గ్రాండ్‌ చెస్‌ టూర్‌ టోరీ్నలు ముగిశాక తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన కార్ల్‌సన్, లిరెన్‌ డింగ్‌ (చైనా), అరోనియన్‌ (అర్మేనియా), మాక్సిమి లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌) డిసెంబర్‌ 2 నుంచి 8 వరకు లండన్‌లో జరిగే గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు.   

Advertisement
 
Advertisement
Advertisement