క్వార్టర్స్‌లో లోకేశ్, సాత్విక్‌ | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో లోకేశ్, సాత్విక్‌

Published Tue, Dec 5 2017 10:57 AM

Lokesh enters sub junior badminton tournament quarters

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు కె. లోకేశ్‌ రెడ్డి, కె. సాత్విక్‌ రెడ్డి నిలకడగా రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ అండర్‌–13 సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన బాలుర సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ లోకేశ్‌ 21–11, 21–16తో చిరాగ్‌ ఖత్రి (ఢిల్లీ)పై గెలుపొందగా, 14వ సీడ్‌ సాత్విక్‌ రెడ్డి 22–20, 21–11తో దేవ్‌ (ఉత్తరప్రదేశ్‌)ను ఓడించాడు.

మరోవైపు బాలుర డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ లోకేశ్‌– సాత్విక్‌ జంట 21–17, 23–21తో శివం శ్రీవాస్తవ్‌–అవిరల్‌ కుమార్‌ యాదవ్‌ (ఉత్తరప్రదేశ్‌) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో అభినయ్‌ సాయిరాం (తెలంగాణ) 21–16, 21–19తో జోమి సింగం (మణిపూర్‌)పై, అక్షత్‌ రెడ్డి (తెలంగాణ) 15–21, 21–13, 21–13తో మన్‌రాజ్‌ సింగ్‌ (హరియాణా)పై గెలుపొందారు. అండర్‌–15 బాలుర మూడో రౌండ్‌ మ్యాచ్‌లో పుల్లెల సాయివిష్ణు 10–21, 8–21తో సిద్ధాంత్‌ గుప్తా చేతిలో పరాజయం చవిచూశాడు.

ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో ప్రణవ్‌ రావు గంధం (తెలంగాణ) 21–8, 21–10తో వెంకట చందన్‌ (తమిళనాడు)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ మేఘనా రెడ్డి (తెలంగాణ) 21–19, 21–14తో అనుపమ  (ఉత్తరాఖండ్‌)పై, అభిలాష (తెలంగాణ) 21–16, 6–21, 21–16తో అదితి భట్‌ (ఉత్తరాఖండ్‌)పై, భార్గవి (తెలంగాణ) 17–21, 21–9, 21–14తో ప్రేరణ అల్వేకర్‌ (మహారాష్ట్ర)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.  
 

Advertisement
Advertisement