జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఐపీఎల్‌ జట్టు 

KXIP Donate Rs 25 Lakh to Families of Five CRPF Soldiers Killed in Pulwama Terror Attack - Sakshi

చంఢీగడ్ ‌: ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలను ఐపీఎల్‌ జట్టు కింగ్స్‌ పంజాబ్‌ ఆదుకుంది. పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్లు జైమాల్‌ సింగ్‌, సుఖిజిందర్‌ సింగ్‌, మహిందర్‌ సింగ్‌, కుల్విందర్‌ సింగ్‌, తిలక్‌ రాజుల కుటుంబాలకు పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, సీఆర్పీఎఫ్‌ డీఐజీ వీకే కౌందాల్‌లు అందజేశారు. గత ఫిబ్రవరి 14న చోటు చేసుకున్న ఈ ఉగ్రదాడిలో 40 మందికిపైగా సీర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

గత ఏడాది అశ్విన్‌ నాయకత్వంలో కొత్తగా కనిపించిన కింగ్స్‌ పంజాబ్‌ జట్టు తొలి 9 మ్యాచ్‌ల్లో 6 గెలిచి దూసుకుపోయింది. కానీ తర్వాతి ఐదు మ్యాచ్‌లు ఓడి అనూహ్యంగా లీగ్‌ దశకే పరిమితమైంది. అయితే ఈ సారి మాత్రం నిలకడైన ప్రదర్శనతో రాణించి టైటిల్‌ కొట్టాలని భావిస్తోంది. కాగా ఈ నెల 23న చెన్నైలో చెన్నై సూపర్‌ కింగ్స్, బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 12వ సీజన్‌కు తెరలేవనున్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్‌ తన తొలి మ్యాచ్‌ను మార్చి 25న రాజస్తాన్‌రాయల్స్‌తో ఆడనుంది.   

చదవండి: పంజాబ్‌కు ‘ఆ ఇద్దరి’ బలం... 
మే 12న  ఐపీఎల్‌ ఫైనల్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top