కోల్‌‘ఖాతా’ తెరిచింది | KKR beat RCB | Sakshi
Sakshi News home page

కోల్‌‘ఖాతా’ తెరిచింది

Apr 8 2018 11:39 PM | Updated on Apr 9 2018 4:06 AM

KKR beat RCB - Sakshi

కోల్‌కతా: సునీల్‌ నరైన్‌ (19 బంతుల్లో 50; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 వికెట్ల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (27 బంతుల్లో 43; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డివిలియర్స్‌ (23 బంతుల్లో 44; 1 ఫోర్, 5 సిక్సర్లు) చెలరేగారు. కోల్‌కతా బౌలర్లలో వినయ్‌ కుమార్, నితీశ్‌ రాణా చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసి గెలిచింది.  కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (29 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు) రాణించాడు. నరైన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

మొదట బెంగళూరు ఇన్నింగ్స్‌ను మెకల్లమ్‌ బౌండరీతో ప్రారంభించాడు. తొలి ఓవర్లోనే 2 ఫోర్లు ఒక భారీ సిక్సర్‌ బాదాడు.  డికాక్‌(4) విఫలమవగా, కోహ్లి అండతో మెకల్లమ్‌ మరింత రెచ్చిపోయాడు. అర్ధసెంచరీకి అడుగులు వేస్తున్న ఇతన్ని నరైన్‌ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వచ్చిన డివిలియర్స్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్, నరైన్, చావ్లా, జాన్సన్‌ ఇలా ఎవరు బౌలింగ్‌కు దిగినా చుక్కలు చూపించాడు. అయితే నితీశ్‌ రాణా బౌలింగ్‌లో డివిలియర్స్, కోహ్లి (33 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్‌) వరుస బంతుల్లో నిష్క్రమించడంతో స్కోరు వేగం మందగించింది. మన్‌దీప్‌ సింగ్‌ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చివర్లో ధాటిగా ఆడాడు.  

లక్ష్యం కష్టసాధ్యమే అయినా నరైన్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌తో పునాది వేయడంతో కోల్‌కతా విజయం దిశగా సాగిపోయింది. స్పిన్, పేస్‌ ఎవరెలా వేసినా అతని జోరుకు బ్రేకు వేయలేకపోయారు. కేవలం 17 బంతుల్లోనే (4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. లిన్‌ (5), ఉతప్ప (13) నిరాశపరిచినా... నితీశ్‌ రాణా (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రసెల్‌ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో కోల్‌కతా బోణీ చేసింది. క్రిస్‌ వోక్స్‌ 3, ఉమేశ్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement