సురేఖ రెండు జాతీయ రికార్డులు 

Jyothi Surekha Creates New Records - Sakshi

ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీకి ఎంపిక

సాక్షి, విజయవాడ స్పోర్ట్స్‌: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ కొత్త సీజన్‌ను ప్రపంచకప్‌ స్టేజ్‌–2 టోర్నమెంట్‌తో మొదలుపెట్టనుంది. మే 11 నుంచి 17 వరకు టర్కీలోని అంటాల్యాలో జరిగే రెండో ప్రపంచకప్‌లో జ్యోతి సురేఖ కాంపౌండ్‌ విభాగంలో భారత్‌ తరఫున బరిలోకి దిగనుంది. గ్వాటెమాలా సిటీలో ఏప్రిల్‌ 20 నుంచి 26 వరకు జరిగే తొలి వరల్డ్‌ కప్‌లో మాత్రం భారత్‌ ద్వితీయ శ్రేణి జట్టును పంపించనుంది. 

ప్రపంచకప్‌లలో పాల్గొనే భారత జట్ల ఎంపిక కోసం హరియాణాలో సోమవారం ముగిసిన సెలక్షన్‌ ట్రయల్స్‌లో సురేఖ రెండు కొత్త జాతీయ రికార్డులు నమోదు చేయడంతోపాటు టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. తొలుత నిర్వహించిన ట్రయల్స్‌లో మొత్తం 720 పాయింట్లకుగాను సురేఖ 709 పాయింట్లు స్కోరు చేసి గతంలో 707 పాయింట్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును సవరించింది. డబుల్‌ ఫిఫ్టీ రౌండ్‌ విభాగంలో 1440 పాయింట్ల కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో సురేఖ 1411 పాయింట్లు సాధించి ఈ విభాగంలోనూ గతంలో 1405 పాయింట్లతో తన పేరిటే ఉన్న రికార్డును తిరగరాసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top