ధోని భాయ్‌ అది పక్కా ఔట్‌!  | Jadeja Convinces MS Dhoni And Virat Kohli To Take DRS Review | Sakshi
Sakshi News home page

Nov 2 2018 8:48 AM | Updated on Nov 2 2018 9:17 AM

Jadeja Convinces MS Dhoni And Virat Kohli To Take DRS Review - Sakshi

హెట్‌మైర్‌ ఔట్‌ అనంతరం భారత ఆటగాళ్ల సంతోషం

అన్నా.. అది పక్కా ఔటన్నా.. నేను గ్యారంటీ ఇస్తా..

తిరువనంతపురం : వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో భారత్‌ దుమ్మురేపి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో జడేజా వేసిన 16వ ఓవర్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ హెట్‌మైర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. జడేజా అప్పీల్‌ చేయగా.. తొలుత అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. దీంతో  ఈ ఔట్‌పై నమ్మకంగా ఉన్న జడేజా రివ్యూ (డీఆర్‌ఎస్‌) కోసం  ధోని, కోహ్లిలను.. ‘భాయ్‌ పక్కా ఔట్‌ భాయ్‌’ అంటూ పట్టుబట్టడంతో రివ్యూ కోరారు. (చదవండి: ముగింపు అదిరింది)

రివ్యూలో హెట్‌మైర్‌ ఔట్‌ అని తేలడంతో జడేజా ‘చెప్పానా భాయ్‌’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే రివ్యూ కోరడంపై ధోని సుముఖంగా లేకపోవడంతో కోహ్లి తీసుకునే ధైర్యం చేయలేదు. కానీ జడేజా పట్టుబట్టడంతో తప్పక రివ్యూకెళ్లాడు. ఎందుకంటే ధోని డీఆర్‌ఎస్‌ నిపుణుడని అందరికీ తెలిసిందే. అతను రివ్యూ కోరితే అది పక్కా ఫలితాన్నిస్తోంది. చాలా మ్యాచ్‌ల్లో ఇది రుజువైంది. ఇక ఈ సిరీస్‌లో చెలరేగిన హెట్‌మైర్‌ వికెట్‌ను విండీస్‌ కోల్పోవడంతో ఆ జట్టు 104 పరుగులకే ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను వైస్‌ కెప్టెన్‌ ( 63 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి ( 33 నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు)లు  14.5 ఓవర్లలో విజయాన్నందించారు. ప్రతీ మ్యాచ్‌లో గట్టి పోటినిచ్చిన విండీస్‌ చివరి మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. దీంతో భారత్‌ 3-1 సిరీస్‌ను సొంతం చేసుకుంది. వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో వన్డే టై అయిన విషయం తెలిసిందే.  (చదవండి: ఉలిక్కిపడిన రోహిత్‌)

Advertisement
 
Advertisement
Advertisement