వరుసగా రెండోసారి... | India's Commonwealth Games Hockey final | Sakshi
Sakshi News home page

వరుసగా రెండోసారి...

Aug 3 2014 2:23 AM | Updated on Sep 2 2017 11:17 AM

వరుసగా రెండోసారి...

వరుసగా రెండోసారి...

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆట ప్రారంభమైన 18 నిమిషాల్లోనే ప్రత్యర్థికి రెండు గోల్స్ సమర్పించుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఆడి మ్యాచ్‌ను దక్కించుకుంది.

కామన్వెల్త్ గేమ్స్ హాకీ ఫైనల్లో భారత్
 సెమీస్‌లో న్యూజిలాండ్‌పై విజయం
 
 గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఆట ప్రారంభమైన 18 నిమిషాల్లోనే ప్రత్యర్థికి రెండు గోల్స్ సమర్పించుకున్నప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఆడి మ్యాచ్‌ను దక్కించుకుంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 3-2తో నెగ్గిన భారత్ తుది పోరుకు అర ్హత సాధించింది. దీంతో వరుసగా రెండు కామన్వెల్త్ గేమ్స్‌ల్లోనూ ఫైనల్స్‌కు చేరిన రెండో జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అటు డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా కూడా ఫైనల్‌కు చేరింది.
 
  రూపిందర్ సింగ్ పాల్, రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్ భారత్ తరఫున గోల్స్ చే శారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో కివీస్ పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి 2వ నిమిషంలోనే సైమన్ చిల్డ్ గోల్ ద్వారా ఖాతా తెరిచింది. 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని 2-0 ఆధిక్యం సాధించింది. అయితే 27వ నిమిషంలో డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ కొట్టిన షాట్‌ను నెట్ దగ్గర ప్రత్యర్థి ఆటగాడు ఛాతీతో ఆపడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ అవకాశం దక్కింది. దీన్ని రూపిందర్ గోల్‌గా మలిచి 1-2తో ఆధిక్యాన్ని తగ్గించాడు. ద్వితీయార్ధంలో భారత్ దూకుడు పెంచింది. 42వ నిమిషంలో మన్‌ప్రీత్ సింగ్ ఇచ్చిన యాంగ్యులర్ పాస్‌ను రమణ్‌దీప్ సింగ్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఇదే జోరులో ఆడిన భారత్‌కు 47వ నిమిషంలో 3-2 ఆధిక్యం లభించింది. ఎస్‌వీ సునీల్ పాస్‌ను ఆకాశ్‌దీప్ రివర్స్ ఫ్లిక్ ద్వారా నెట్‌లోకి పంపి భారత శిబిరంలో ఆనందం నింపాడు. చివర్లో మ్యాచ్ హోరాహోరీగా జరిగినా భారత్ తన ఆధిక్యాన్ని కాపాడుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement