అమ్మాయిల ఘన విజయం
స్పెయిన్తో హాకీ సిరీస్
మర్సియా (స్పెయిన్): ఆతిథ్య స్పెయిన్తో తొలి మ్యాచ్లో ఓడి రెండో మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్లో సత్తా చాటింది. మంగళవారం జరిగిన పోరులో భారత్ 5–2తో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున లాల్రెమ్సియామి (17వ, 58వ నిమిషాల్లో), నేహా గోయల్ (21వ ని.), నవనీత్ కౌర్ (32వ ని.), కెప్టెన్ రాణి రాంపాల్ (51వ ని.) గోల్స్ సాధించారు. స్పెయిన్ తరఫున బెర్తా బొనాస్త్రే (7వ, 35వ నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టింది.
ముందుగా స్పెయిన్ గోల్ సాధించి 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రెండో క్వార్టర్లో రెండు, మూడో క్వార్టర్లో ఒక గోల్ చేసిన భారత్ 3–1తో ముందంజ వేసింది. అయితే మూడు నిమిషాలకే స్పెయిన్ గోల్ సాధించడంతో ఆధిక్యం 3–2కు తగ్గింది. చివరి క్వార్టర్లోనూ అదే జోరు కనబర్చిన రాణి సేన భారీ తేడాతో మ్యాచ్ను గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య గురువారం నాలుగో మ్యాచ్ జరుగుతుంది.
మరిన్ని వార్తలు