వన్డే సిరీస్‌ భారత్‌దే

Indian Women Cricket Team Win The Series Against England - Sakshi

నాగ్‌పూర్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తేడాతో గెలుచుకుంది.  గురువారం విదర్భ స్టేడియంలో  జరిగిన నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సాధించింది. ఇంగ్లండ్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించిన భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ను భారీ స్కోర్‌ చేయకుండా భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జేమ్స్‌(94; 119 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్‌) రాణించడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్‌, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు సాధించారు. 

ఆ తర్వాత 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23 పరుగులకే రోడ్రిగ్స్‌, వేదా కృష్ణమూర్తి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో నిలిచింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌ స్మృతి మంధన (53 రిటైర్డ్‌ హర్ట్‌;67 బంతుల్లో 6ఫోర్లు) తో కలిసి కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(74నాటౌట్‌; 124 బంతుల్లో 9ఫోర్లు) ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. మంధన ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(54నాటౌట్‌; 61 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్‌) మెరుపు బ్యాటింగ్‌ చేసి భారత్‌ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ ష్రబ్‌సోల్‌ రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన దీప్తిశర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, సిరీస్‌లో నిలకడగా రాణించిన స్మృతి మంధన ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ గెలుచుకున్నారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top