కొత్త శిఖరాలకు...

Indian Players Records In The World Championships - Sakshi

ఒకప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనడమే ఘనతగా భావించే భారత క్రీడాకారులు ఇప్పుడు ఏకంగా పతకాలు కొల్లగొడుతున్నారు. క్రీడల్లో అగ్రరాజ్యాల ఆటగాళ్లకు దీటుగా తమ ప్రదర్శన ఇస్తున్నారు. ఆశల పల్లకీని మోస్తూ అసలు సమరంలోనూ ఔరా అనిపిస్తున్నారు. విశ్వ వేదికపై భారత మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలకు చేరింది. బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు విశ్వవిజేతగా అవతరించి గతంలో ఏ భారత షట్లర్‌కూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది.

బాక్సింగ్‌లో అమిత్‌ పంఘాల్, మనీశ్‌ కౌశిక్‌ రజత, కాంస్య పతకాలు గెలిచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలు అందించారు. షట్లర్లు, బాక్సర్లకు తోడుగా షూటర్లు, రెజ్లర్లు, ఆర్చర్లు కూడా అత్యున్నత వేదికపై అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం అదరగొట్టిన భారత క్రీడాకారులు వచ్చే ఏడాది విశ్వ క్రీడా సంరంభం టోక్యో లింపిక్స్‌లోనూ తమ అది్వతీయ విజయ విన్యాసాలను పునరావృతం చేయాలని ఆకాంక్షిద్దాం... ఆశీర్వదిద్దాం..!  

సాక్షి క్రీడావిభాగం
విజయాల బాటలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ... తమకంటే మెరుగైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ... ఈ ఏడాది భారత క్రీడాకారుల ప్రస్థానం సాగింది. ఈ క్రమంలో మనోళ్లు కొత్త రికార్డులు సృష్టించారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు రేకెత్తించారు.  

మెరుపుల్లేని టెన్నిస్‌ రాకెట్‌...
ఈ సంవత్సరం భారత టెన్నిస్‌కు గొప్ప ఫలితాలేవీ రాలేదు. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించినా... ఒక్క దాంట్లోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. యూఎస్‌ ఓపెన్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌తో భారత యువతార సుమీత్‌ నాగల్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ ఆడాడు. ఫెడరర్‌పై తొలి సెట్‌ గెలిచిన సుమీత్‌ ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు కోల్పోయి ఓడిపోయాడు. డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌ రెండు ఏటీపీ టోర్నీ టైటిల్స్‌ (పుణే ఓపెన్, సెయిట్‌ పీటర్స్‌బర్గ్‌ ఓపెన్‌) సాధించగా... రోహన్‌ బోపన్న (పుణే ఓపెన్‌) ఒక టైటిల్‌ గెలిచాడు. భారత దిగ్గజం, 46 ఏళ్ల లియాండర్‌ పేస్‌ 19 ఏళ్ల తర్వాత ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్‌–100 నుంచి బయటకు వచ్చాడు. తటస్థ వేదిక కజకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా మ్యాచ్‌లో భారత్‌ 4–0తో గెలిచి వచ్చే ఏడాది వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ పోటీలకు అర్హత సాధించింది.  

‘పట్టు’ పెరిగింది...

ఈ ఏడాది రెజ్లింగ్‌లో భారత్‌కు మంచి ఫలితాలు లభించాయి. కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఏకంగా ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), రవి దహియా (57 కేజీలు), రాహుల్‌ అవారే (61 కేజీలు) కాంస్యాలు గెలుపొందగా... దీపక్‌ పూనియా (86 కేజీలు) రజతం సాధించాడు. మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు) కాంస్య పతకం దక్కించుకుంది. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌íÙప్‌లో దీపక్‌ పూనియా (86 కేజీలు) స్వర్ణం నెగ్గి 18 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్‌లోని ఓ విభాగంలో భారత్‌కు పసిడి పతకం అందించిన రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఈ సంవత్సరం ఉత్తమ ప్రపంచ జూనియర్‌ రెజ్లర్‌గా కూడా దీపక్‌ పూనియా ఎంపిక కావడం విశేషం.  

సస్పెన్షన్‌ ఉన్నా...

భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ) అంతర్గత రాజకీయాల కారణంగా ప్రపంచ ఆర్చరీ సంఘం భారత్‌పై సస్పెన్షన్‌ విధించింది. దాంతో భారత ఆర్చర్లు భారత పతాకం కింద కాకుండా ప్రపంచ ఆర్చరీ సంఘం పతాకంపై పోటీ పడాల్సి వచి్చంది. జూన్‌లో నెదర్లాండ్స్‌లో జరిగిన ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్, తరుణ్‌దీప్‌ రాయ్‌ బృందం రికర్వ్‌ టీమ్‌ విభాగంలో రజతం నెగ్గడంతోపాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్‌ కాంపౌండ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ జ్యోతి సురేఖ వ్యక్తిగత, టీమ్‌ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించింది. బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌íÙప్‌లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ఇదే ఈవెంట్‌లో దీపిక కుమారి మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ను సంపాదించింది.  

జగజ్జేత...

గత పదేళ్లుగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తమదైన ముద్ర వేస్తున్న భారత షట్లర్లు ఈసారి అద్భుతమే చేశారు. పూసర్ల వెంకట (పీవీ) సింధు రూపంలో భారత బ్యాడ్మింటన్‌కు తొలిసారి ప్రపంచ చాంపియన్‌ లభించింది. ఆగస్టులో స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధు మహిళల సింగిల్స్‌ విభాగంలో విశ్వవిజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఇక పురుషుల సింగిల్స్‌లో మరో తెలుగు తేజం భమిడిపాటి సాయిప్రణీత్‌ 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ప్రకాశ్‌ పదుకొనే (1983లో) తర్వాత ప్రపంచ చాంపియన్‌íÙప్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడిగా సాయిప్రణీత్‌ ఘనత వహించాడు.

వీరిద్దరి ప్రతిభ కారణంగా 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు తొలిసారి మహిళల, పురుషుల సింగిల్స్‌ విభాగాల్లో పతకాలు లభించాయి. ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో ప్రదర్శనను మినహాయిస్తే వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టోర్నమెంట్‌లలో ఈసారి భారత అగ్రశ్రేణి క్రీడాకారులెవరూ ఆకట్టుకోలేకపోయారు. పురుషుల డబుల్స్‌ విభాగంలో సాతి్వక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించి మేటి జోడీకి ఉండాల్సిన లక్షణాలు తమలో ఉన్నాయని చాటిచెప్పింది. సీజన్‌ చివర్లో యువతార లక్ష్య సేన్‌ ఐదు సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించి ఊరటనిచ్చాడు. ఏడాది ఆరంభంలో జరిగిన ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌)లో బెంగళూరు రాప్టర్స్‌ జట్టు టైటిల్‌ దక్కించుకుంది. ఫైనల్లో బెంగళూరు 4–3తో ముంబై రాకెట్స్‌పై గెలిచింది.

మరింత ‘ఎత్తు’కు...
భారత చెస్‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం ఆరుగురు గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా పొందారు. ఈ జాబితాలో విశాఖ్‌ (తమిళనాడు), గుకేశ్‌ (తమిళనాడు), ఇనియన్‌ (తమిళనాడు), స్వయమ్స్‌ మిశ్రా (ఒడిశా), గిరిశ్‌ కౌశిక్‌ (కర్ణాటక), ప్రీతూ గుప్తా (ఢిల్లీ) ఉన్నారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయస్సులో డి.గుకేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొంది భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన పిన్న వయసు్కడిగా... ప్రపంచంలో రెండో పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 2002లో సెర్గీ కర్యాకిన్‌ (రష్యా) 12 ఏళ్ల 10 నెలల వయస్సులో జీఎం హోదా సాధించాడు. ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టూర్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రష్యా గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ సాధించి... మొనాకో గ్రాండ్‌ప్రిలో రన్నరప్‌గా నిలిచింది.  

‘పంచ్‌’ అదిరింది...

బాక్సింగ్‌లోనూ ఈ సంవత్సరం భారత క్రీడాకారులు అదరగొట్టారు. రష్యాలో జరిగిన పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌íÙప్‌లో అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు) రజతం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బాక్సర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు) కాంస్యం గెలవడంతో ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌కు తొలిసారి ఒకేసారి రెండు పతకాలు లభించాయి. సీనియర్‌ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగు పతకాలు దక్కాయి. దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు)తోపాటు జమునా బోరో (54 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు) కాంస్యాలు సాధించగా... మంజు రాణి (48 కేజీలు) రజత పతకం గెల్చుకుంది.

సూపర్‌ ‘గురి’...

షూటింగ్‌లో మనోళ్లు గురి చూసి పతకాల పంట పండించారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అపూర్వీ చండేలా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో... సౌరభ్‌ చౌధరీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ప్రపంచ రికార్డులు సృష్టించి పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సౌరభ్‌–మను భాకర్‌ జోడీ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఏప్రిల్‌లో చైనాలో జరిగిన రెండో ప్రపంచకప్‌ టోర్నీలోనూ భారత షూటర్లు మెరిశారు. మూడు స్వర్ణాలు, ఒక రజతం సాధించి ‘టాప్‌’ ర్యాంక్‌ను సంపాదించారు. ఆసియా చాంపియన్‌íÙప్‌లోనూ భారత షూటర్లు అదుర్స్‌ అనిపించారు. ఓవరాల్‌గా ఈసారి భారత్‌ నుంచి అత్యధికంగా 15 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

చలాకీ... హాకీ
సొంతగడ్డపై జరిగిన టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో తమ ప్రత్యర్థులను ఓడించిన భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్‌ బెర్త్‌లను సంపాదించాయి. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో రష్యాపై భారత పురుషుల జట్టు... అమెరికాపై భారత మహిళల జట్టు గెలుపొందాయి. అంతకుముందు సీజన్‌ ఆరంభంలో భారత పురుషుల జట్టు అజ్లాన్‌ షా హాకీ టోరీ్నలో రన్నరప్‌గా నిలిచింది.  

అదే మందగమనం...
‘ఆసియా’ స్థాయి మినహాయిస్తే అంతర్జాతీయంగా భారత అథ్లెట్స్‌ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే సత్తా ఉన్న అథ్లెట్స్‌గా నీరజ్‌ చోప్రా (జావెలిన్‌ త్రో), హిమ దాస్‌ (మహిళల 400 మీటర్లు)లపై భారీ ఆశలు పెట్టుకున్నా వారిద్దరూ గాయాల బారిన పడ్డారు. సెపె్టంబర్‌లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌íÙప్‌కు దూరమయ్యారు. ఇటలీలో జూలైలో జరిగిన వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో ద్యుతీ చంద్‌ మహిళల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. అయితే ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో ద్యుతీ చంద్‌ విఫలమైంది. ఆమె హీట్స్‌ దాటి ముందుకెళ్లలేకపోయింది. ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌ అర్హత సమయాన్ని (11.15 సెకన్లు) ఆమె అందుకోలేకపోయింది.

దీటుగా... టీటీ...

టేబుల్‌ టెన్నిస్‌లో భారత స్టార్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ అద్భుత పురోగతి సాధించాడు. ఈ ఏడాది అతను ప్రపంచ టాప్‌–20 ర్యాంకింగ్స్‌లోని పలువురు ఆటగాళ్లను ఓడించాడు. అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌ తరఫున పురుషుల సింగిల్స్‌ ఆటగాడు ఐటీటీఎఫ్‌ టాప్‌–25 ర్యాంకింగ్స్‌లో రావడం ఇదే ప్రథమం. సత్యన్, శరత్‌ కమల్, హర్మీత్‌ దేశాయ్‌లతో కూడిన భారత జట్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఎనిమిదో ర్యాంక్‌కు చేరుకుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top