టీమిండియా బ్యాటింగ్ ‘విచిత్రం’ చూశారా?

రాంచీ: భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మూడు మ్యాచ్ల్లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించగా, మూడో వన్డే ఆసీస్ గెలుపును అందుకుంది. రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 48.2 ఓవర్లలో 281 పరుగులకే ఆలౌటై పరాజయం చవిచూసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి శతకం సాధించినప్పటికీ అది వృథానే అయ్యింది.
అయితే, ఈ మూడు వన్డేల్లో భారత్ బ్యాటింగ్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లోనూ భారత్ 48.2 ఓవర్లు మాత్రమే ఆడడం విశేషం. హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 236/7 చేయగా, భారత్ 48.2 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాగ్పూర్లో జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మూడో వన్డేలోనూ మ్యాచ్లోనూ సరిగ్గా 48.2 ఓవర్ల వద్దే భారత్ ఆలౌట్ అయింది.
ఇక్కడ చదవండి: ఇక చాలు.. మళ్లీ చూడదల్చుకోలేదు : కోహ్లి
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి