టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీకి శనివారం (ఫిబ్రవరి 7) తెరలేవనుంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మెరుపు వేగంతో పరుగుల వరద మొదలవ్వనుంది. ఈ పరుగుల సునామీలో టాప్లో ఉండేదెవరు? తోపుగా నిలిచేదెవరు? ఈ సారి కొత్త రికార్డులు నమోదవుతాయా? ఆటగాళ్లు తమ రికార్డులను తిరిగి బ్రేక్ చేస్తారా? ఈసారీ టీమిండియా హాట్ ఫేవరెట్గా ఉన్నా.. భారత్ ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి?
టీమిండియా బలాలు, బలహీనతలుఏమిటి?? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానంగా సాక్షి స్పోర్ట్స్ పలు పారామితులతో, అల్గారిథమ్లతో ఓ విశ్లేషణను రూపొందించింది.
టీ20 ప్రపంచకప్ పోటీలు 2007లో ప్రారంభమయ్యాయి. 2010 నుంచి ప్రతీ రెండేళ్లకోసారి ఈ టోర్నీలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో జరిగిన ప్రపంచకప్ను మూడు జట్లు రెండేసి మార్లు గెలుచుకున్నాయి. అవే.. భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా తలోసారి ట్రోఫీ సాధించాయి.
ఇక టీమ్ ఇండియా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్. 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి.. టైటిల్ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో ముందంజలో ఉండడం కలిసి వచ్చే అంశం..!
ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఏకైక జట్టు ఇదే
అయితే.. ఇప్పటి వరకు ఈ టైటిల్ గెలిచిన ఆరు జట్లలో ఒక్క ఫైనల్ కూడా ఓడిపోని ఏకైక జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. భారత్, ఇంగ్లండ్ జట్లు చెరోసారి తో రన్నరప్గా.. పాకిస్థాన్, శ్రీలంక రెండేసిసార్లు ఫైనల్లో ఓటమిపాలయ్యాయి. అయితే.. తాజా ప్రదర్శనలను బట్టి మాజీ చాంపియన్లు టీమిండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్గా కనిపిస్తున్నాయి. ఇందులోనూ డిఫెండింగ్ చాంపియన్ టీమిండియానే టాప్
ఇప్పటి వరకు జరిగిన తొమ్మిది టీ-20 ప్రపంచ కప్లలో ప్రతీ జట్టు 45 నుంచి 55 మ్యాచులు ఆడింది. వీటిలో టీమిండియా విజయ శాతం అత్యద్భుతంగా ఉంది. ఆడిన 52 మ్యాచుల్లో.. 35 విజయాలను నమోదు చేసుకుంది. అంటే.. టీమిండియాకు 63శాతం విజయం రేటు ఉందన్నమాట. ఇప్పుడు దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా జట్లకు కూడా ఇదే రేట్ ఉండడం గమనార్హం..! అయినా.. ఈ పారామితిలో టీమిండియానే నంబర్-1 అని చెప్పవచ్చు.
60 శాతానికి పైగా గెలుపు రేటు
కేవలం ప్రపంచకప్ టోర్నీలోనే కాకుండా.. పొట్టి ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్లలోనూ టీమిండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అగ్రశ్రేణి జట్లు 200కు పైగా టీ-20 మ్యాచులు ఆడాయి. వీటిలో 60 శాతానికి పైగా గెలుపు రేటును సాధించిన ఏకైక జట్టు టీమిండియా మాత్రమే..! 268 మ్యాచుల్లో భారత్ 67 శాతం విన్నింగ్ రేట్తో ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా వరుసగా ఉన్నాయి. ఈ పారామితిలోనూ టీమిండియానే హాట్ ఫేవరేట్..!
ఇక సొంత దేశంలో మ్యాచులు ఆడడానికి, విదేశాల్లోని మైదానాలకు తేడా ఉంటుంది. పలు జట్లు విదేశాల్లో పెద్దగా రాణించవు. కానీ, టీమిండియా మాత్రం ఈ పారామితిలోనూ ముందంజలో ఉంది. భారత్ విదేశాల్లో 165 మ్యాచులు ఆడగా.. విజయ శాతం 66గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. అయితే.. ఈ రెండు జట్ల విజయ శాతం 55 మాత్రమే..!
విదేశాల్లోని మైదానాల్లో పరిస్థితిని పక్కనపెడితే.. సొంత గడ్డపైనా భారత్ ముందంజలో ఉండడం గమనార్హం..! సంప్రదాయ క్రికెట్ టెస్టుల్లో, వన్డేలలో పరిస్థితి వేరు. కానీ, టీ-20 శకంలో మాత్రం పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఆటగాళ్ల ఊపు.. ధనాధన్ బాదుడే విజయాన్ని నిర్దేశిస్తాయి.
భారతే హాట్ ఫేవరేట్..!
అయితే.. ఈ సారి టీ-20 ప్రపంచకప్ భారత్తోపాటు.. శ్రీలంకలో జరగనుంది. ఈ రెండు దేశాల్లోని మైదానాలు భారత్కు కొట్టిన పిండి అని చెప్పవచ్చు.ఇక స్వదేశాల్లో విజయాల విషయానికి వస్తే.. భారత్ ఆడిన 103 టీ-20 ఫార్మాట్లలో 70 విజయాలను సాధించింది. అంటే.. గెలుపు శాతం 68గా ఉంటుంది. ఈ విషయంలో భారత్కు పాకిస్థాన్ 0.10శాతం వెనుకంజలో ఉంది. అంటే.. ఈ పారామితిలోనూ భారతే హాట్ ఫేవరేట్..!
టీ20 మ్యాచులు సంప్రదాయ వన్డేలకు పూర్తిగా భిన్నమైనవి. ఇక్కడ స్కోరు అత్యంత కీలకం. సిక్సర్లు, ఫోర్లతో.. బంతిబంతికీ బౌండరీ ఉంటేనే విజయలక్ష్మి వరించే అవకాశాలుంటాయి. ఈ విషయంలోనూ టీమిండియాదే ఆధిపత్యం..! ఇప్పటి వరకు టీమిండియా ఆడిన టీ-20 మ్యాచుల్లో 46 సార్లు 200కు పైగా స్కోర్ చేసింది. అంతేకాదు.. నాలుగుసార్లు 250+ స్కోరును తన ఖాతాలో వేసుకుంది. మరే ఇతర జట్టు కూడా 200+ స్కోరును 30 సార్లు కూడా అందుకోలేకపోయింది.
అయితే.. భారత్ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ రెండు జట్లు 28 సార్లు చొప్పున 200+ స్కోరును సాధించడం గమనార్హం..! ఇక 250+ స్కోరు విషయానికి వస్తే.. కేవలం ఇంగ్లండ్, వెస్టిండీస్ మాత్రమే.. భారత్ తర్వాత ఈ స్కోరును సాధించాయి.
ఇప్పటి వరకు 20 సెంచరీలు
భారత్ నాలుగు సార్లు ఈ ఘనతను సాధిస్తే.. ఈ రెండు జట్లు రెండేసి సార్లు మాత్రమే ఆ స్కోరును దాటగలిగాయి. అన్నింటికీ మించి.. 200+ టార్గెట్ను సులభంగా ఛేదించగలమని భారత జట్టు పలుమార్లు రుజువు చేసింది. ఈ పారామితిలోనూ భారతే తోపు అని చెప్పవచ్చు..!
టీ20 ఫార్మాట్లో జట్టు విజయాన్ని బౌండరీలే శాసిస్తాయి. అందుకే దీన్ని బ్యాటర్ల ఆట అంటారు. ఇలాంటి ఫార్మాట్లోనూ సెంచరీలు చేయడం అంత ఆశామాషీ కాదు. అయితే.. భారత బ్యాటర్లు టీ-20ల్లో ఇప్పటి వరకు 20 సెంచరీలు చేసి.. జట్టును ముందంజలో నిలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో చెరో 13 సెంచరీలతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉన్నారు.
ఈ పారామితిలోనూ భారతే తోపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు..! సాక్షి డిజిటల్ స్పోర్ట్స్ బృందం పరిశీలించిన అల్గారిథమ్లు, పారామితుల్లో భారత్ మాత్రమే టీ-20లో ముందంజలో ఉండే అవకాశాలున్నట్లు స్పష్టమైంది.


