ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌! | Setback For Desperate Pak In Battle With ICC Other Boards Clear Stance | Sakshi
Sakshi News home page

ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Feb 3 2026 5:51 PM | Updated on Feb 3 2026 7:19 PM

Setback For Desperate Pak In Battle With ICC Other Boards Clear Stance

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి కౌంట్‌డౌన్‌ మొదలైనా పాకిస్తాన్‌ మొండివైఖరి వీడటం లేదు. బంగ్లాదేశ్‌ కోసమంటూ నాటకానికి తెరతీసిన పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)నే ఢీకొట్టేందుకు సిద్ధమైంది. పాక్‌ మ్యాచ్‌ల కోసం తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసినా.. భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామంటూ మరో డ్రామాకు తెరలేపింది.

బంగ్లాదేశ్‌కు ఇప్పటికే షాక్‌
తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామని.. అందుకే టీమిండియాతో మ్యాచ్‌ ఆడబోమని పీసీబీ పేర్కొంది. అయితే, ఐసీసీకి మాత్రం ఇంతవరకు అధికారికంగా మాత్రం ఇ-మెయిల్‌ పంపలేదు. కాగా భారత్‌లో తమకు భద్రత లేదంటూ గగ్గోలు పెట్టిన బంగ్లాదేశ్‌కు ఇప్పటికే ఐసీసీ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే.

తమ పరిశీలన బృందం నివేదిక ప్రకారం భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని.. అందుకే వేదికను శ్రీలంకకు మార్చలేమని ఐసీసీ స్పష్టం చేసింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పంతం వీడకపోవడంతో ఆ జట్టును తప్పించి.. స్కాట్లాండ్‌ను వరల్డ్‌కప్‌ టోర్నీలో చేర్చింది. 

టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు
ఈ అంశమై ఓటింగ్‌ నిర్వహించగా.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఆ దేశంతో పాటు పాక్‌ మాత్రమే అనుకూలంగా ఓటు వేయగా.. మిగతా ఐసీసీ సభ్య దేశాలు మాత్రం వ్యతిరేకించాయి.

దీంతో పాకిస్తాన్‌ తాము సైతం టోర్నీ నుంచి వైదొలుగుతామని మొదట బీరాలు పలికినా.. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్‌ మాత్రమే ఆడమని ప్రకటించింది. ఇందుకు భద్రతా కారణాలు సాకుగా చూపడం గమనార్హం. శ్రీలంకలో ఆడే మిగతా మ్యాచ్‌లకు లేని భద్రతా సమస్యలు.. టీమిండియాతో మ్యాచ్‌కు ఉంటాయని చెప్పడం విమర్శలకు దారితీసింది.

ఆ అధికారం, హక్కు మాకు లేవు
ఈ నేపథ్యంలో పాక్‌ బోర్డు.. ఇతర దేశాల బోర్డులను సంప్రదించి తమకు అనుకూలంగా మాట్లాడాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఐసీసీతో సమావేశంలో తమకు, బంగ్లాదేశ్‌కు అనుకూలంగా వ్యవహరించాలని బతిమాలినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో పాక్‌కు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.

డబుల్‌ గేమ్‌ ఎందుకు?
రెవ్‌స్పోర్ట్స్‌ కథనం ప్రకారం.. ఈ అంశాల్లో తలదూర్చే అధికారం, హక్కు తమకు లేవని ఆయా బోర్డులు పీసీబీకి స్పష్టం చేసినట్లు సమాచారం. ఐసీసీ, బీసీబీ మధ్య వివాదంలో తాము దూరలేమని పేర్కొన్న బోర్డులు.. పీసీబీ ద్వంద్వ వైఖరిని కూడా ఎండగట్టినట్లు తెలుస్తోంది.

కాగా ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో పాక్‌.. భారత్‌తో మ్యాచ్‌ ఆడింది. యువ భారత జట్టు చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు.. పాక్‌ మహిళల ‘ఎ’ జట్టు.. ఫిబ్రవరి 15న భారత మహిళల ‘ఎ’ జట్టుతో తలపడనుంది. బ్యాంకాక్‌లో జరిగే రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ 2026లో భాగంగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. అయితే, పాక్‌ ఈ మ్యాచ్‌లో యథావిధిగా ఆడనుంది.

పాక్‌కు గట్టి షాక్‌
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఐసీసీ సభ్య దేశాలకు బోర్డులు.. పీసీబీకి తాము అండగా ఉండలేమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం. కాగా భారత్‌- శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ను కొలంబోలో ఫిబ్రవరి 15న నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారు కాగా.. పీసీబీ ఇలా బాయ్‌కాట్‌ అంటూ సాగదీస్తోంది.

చదవండి: T20 WC 2026: ఆందోళనలో టీమిండియా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement