టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈసారి కూడా సత్తా చాటి.. సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్కప్ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సూర్యకుమార్ సేనకు అన్ని అర్హతలు ఉన్నాయి.
ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత ఆట తీరుతో దుమ్ములేపిన టీమిండియా స్వదేశంలో మెగా టోర్నీ జరుగనుండటం సానుకూలాంశం. అయితే, వరల్డ్కప్ ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లు వరుసగా గాయాలపాలైన విషయం తెలిసిందే. అక్షర్ పటేల్ (Axar Patel), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలబారిన పడ్డారు.
పూర్తిగా కోలుకున్న తిలక్
వీరిలో వేలి నొప్పితో బాధపడిన అక్షర్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్ (IND vs NZ)లో ఆఖరి మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (Tilak Varma) కూడా పూర్తిగా కోలుకున్నాడు. వరల్డ్ కప్ జట్టు సభ్యుడైన ఈ హైదరాబాదీకి ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది.
అనంతరం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రీహాబిలిటేషన్లో ఉన్న తిలక్ మ్యాచ్ ఫిట్గా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.ఈ క్రమంలో ప్రపంచకప్ అసలు పోరుకు ముందు జరిగే రెండు వార్మప్ మ్యాచ్ల ద్వారా తిలక్ వర్మకు ప్రాక్టీస్ కల్పించాలని భావించిన సెలక్టర్లు భారత ‘ఎ’ జట్టులో చోటు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా జట్టుతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 పరుగులు చేసి.. వరల్డ్కప్ టోర్నీకి తాను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు.

వాషీ విషయంలో ఆందోళన
అయితే, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. వాషీ వేగంగా కోలుకుంటున్నా వరల్డ్కప్ లీగ్ దశ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.
"వాషింగ్టన్ సుందర్ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. అతడి పక్కటెముకలో ఫ్రాక్చర్ ఉంది. అయితే, అతడు వేగంగానే కోలుకుంటున్నాడు. ఇప్పటికే నాలుగు బ్యాటింగ్ సెషన్లు పూర్తి చేసుకున్నాడు.
సోమవారం (ఫిబ్రవరి 2) స్పాట్ బౌలింగ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. బుధవారం మరోసారి బౌలింగ్ సెషన్లో వాషీ పాల్గొంటాడు. దీని ఆధారంగానే అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై అంచనాకు రావొచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
వారికి లైన్క్లియర్
కాగా వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్నాడు. తిలక్ వర్మ, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ కూడా ఇక్కడే పునరావాసం పొందారు. వీళ్లందరూ పూర్తి ఫిట్గా ఉన్నట్లు ఫిజియోలు ఇటీవలే ప్రకటించారు.
కాగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు స్వదేశీ స్పిన్ పిచ్ల మీద రాణించగల సత్తా వాషీకి ఉంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్లు ఉన్నా వాషీ లేకపోవడం కూడా లోటు లాంటిదే. కాగా ఫిబ్రవరి 7న భారత్- శ్రీలంక వేదికగా మొదలయ్యే వరల్డ్కప్ టోర్నీ మార్చి 8న ఫైనల్తో ముగుస్తుంది.
చదవండి: టీమిండియాతో ఆడకున్నా.. ఆ మూడు మ్యాచ్లు గెలుస్తాం: పాక్ కెప్టెన్


