భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్‌ ఖతం: రమీజ్‌ రాజా | Ramiz Raja Warned Them: Cut Off India and PCB Could Collapse Old Video | Sakshi
Sakshi News home page

భారత ప్రధాని ఒక్క మాట చెబితే మన ఖేల్‌ ఖతం: రమీజ్‌ రాజా

Feb 3 2026 8:00 PM | Updated on Feb 3 2026 9:06 PM

Ramiz Raja Warned Them: Cut Off India and PCB Could Collapse Old Video

క్రికెట్‌ వర్గాల్లో ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వైఖరి గురించేప్రధానంగా చర్చ నడుస్తోంది. తమకు అవసరం లేని విషయంలో తలదూర్చి పాక్‌ కష్టాలు కొని తెచ్చుకుంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఇప్పటికే తప్పించిన విషయం తెలిసిందే.

కోరికోరి వివాదాలు
భారత్‌లో తమకు భద్రత ఉండదంటూ ఆరోపణలకు దిగిన బంగ్లా.. మరో వేదికైన శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడించాలని ఐసీసీని కోరింది. అయితే, ఈ వాదనలో నిజం లేదంటూ కొట్టిపారేసిన ఐసీసీ.. బంగ్లా అభ్యర్థనను తిరస్కరించింది. అయినప్పటికీ బంగ్లా పట్టువీడకపోవడంతో.. బంగ్లాదేశ్‌ స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది.

అయితే, బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందంటూ తాము కూడా టోర్నీలో పాల్గొనమని బెదిరింపు ధోరణి అవలంబించిన పాకిస్తాన్‌.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందనేమో.. కేవలం భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామని ప్రకటించింది. 

తటస్థ వేదికల ఏర్పాటు
కాగా భారత్‌- పాక్‌ మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరిగి దశాబ్దకాలానికి పైగా అవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌ టోర్నీలో ముఖాముఖి తలపడుతున్న దాయాదుల మధ్య 2024లో ఐసీసీ ఓ ఒప్పందం కుదిర్చింది.

ఇరు దేశాల్లో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. మరో జట్టు కోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగానే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి పాక్‌ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. 

ఆ తర్వాత ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్‌ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడింది. తాజాగా టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాక్‌ పురుషుల జట్టు శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

భారత్‌తో పెట్టుకుంటే అంతే
అయినప్పటికీ బంగ్లాదేశ్‌ కోసమంటూ పాక్‌.. భారత్‌ను ఢీకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీబీ మాజీ చైర్మన్‌ రమీజ్‌ రాజా.. భారత్‌తో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని గతంలో హెచ్చరించిన వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది.

సెనేట్‌ స్టాండింగ్‌ కమిటీ ముందు 2021లో పీసీబీ చైర్మన్‌ హోదాలో మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పే విషయాలు భయపెట్టేవని నాకు తెలుసు. ఐసీసీ నుంచి వచ్చే 50 శాతం నిధులతోనే పాక్‌ బోర్డు తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇతర బోర్డు మెంబర్లతో కలిసి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా ఐసీసీకి ఆదాయం వస్తుంది.

90 శాతం ఆదాయం అక్కడి నుంచే
ఇక ఐసీసీకి వచ్చే ఆదాయంలో 90 శాతం ఇండియన్‌ మార్కెట్ల నుంచే వస్తుంది. అంటే ఒకరకంగా.. భారత్‌లోని వ్యాపారం వల్లే పాకిస్తాన్‌ క్రికెట్‌ మనుగడ కొనసాగిస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో భారత ప్రధాని పాకిస్తాన్‌ క్రికెట్‌కు ఫండింగ్‌ ఆపేయమని చెబితే.. పీసీబీ కుప్పకూలుతుంది’’ అని రమీజ్‌ రాజా వ్యాఖ్యానించాడు. 

అయితే, ఈ వీడియో ఫేక్‌ కావొచ్చు అంటూ పాక్‌ అభిమానులు అంటుండగా... ఏదేమైనా ఈ మాటలు మాత్రం నిజమేనంటూ టీమిండియా ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు.  

చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement