టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో మ్యాచ్ను బాయ్కట్ చేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడుతామని, భారత్తో మాత్రం తలపడబోమని పాక్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ అనుహ్య నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో మిశ్రమ స్పందన వస్తోంది.
చాలా మంది పాక్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం త్వరలోనే మారిపోతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అంచనా వేస్తున్నారు.
"నాలుగు రోజుల పాటు ఈ అంశంపై స్పందనలు చూసిన తర్వాత పీసీబీ తమ నిర్ణయం మార్చుకుంటుంది. ఇందులో కొత్తేమీ లేదు. పాక్ క్రికెటర్లంతా రిటైర్మెంట్ ప్రకటించడం... కొద్ది రోజులకే అభిమానులు మా ఆటను ఇంకా చూడాలనుకుంటున్నారు అంటూ రిటైర్మెంట్ ప్రకటన వెనక్కి తీసుకోవడం ఎన్నోసార్లు జరిగింది. పీసీబీ నిర్ణయంపై ఐసీసీ చర్య కూడా తీసుకోవచ్చు" అని గావస్కర్ పేర్కొన్నారు.
మరోవైపు పాక్ ఆడబోమని చెబుతున్నా...నిబంధనల ప్రకారం భారత జట్టు మ్యాచ్ కోసం కొలంబోకు ప్రయాణించాల్సి ఉంటుంది. మైదానానికి వెళ్లిన తర్వాత మరో జట్టు ఆడటం లేదని నిర్ధారణ అయ్యాకే ఐసీసీ రిఫరీ అధికారిక ప్రకటనతో మ్యాచ్ రద్దు అవుతుంది.
చదవండి: భారత్, పాక్ మ్యాచ్ జరగకపోతే రూ.2,289 కోట్ల నష్టం!


