భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మెషీన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్ ఎక్కువే.
274 మిలియన్ల ఫాలోవర్లు
ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు.
అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం.
కాసేపు డీయాక్టివేట్
అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేట్ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్ ఫ్యాన్స్.. అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్లి.. ఆరా తీశారు.
వదినమ్మా.. అసలేం జరిగింది?
‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్ రీయాక్టివేట్ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
వన్డేల రారాజు
కాగా బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం.
ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్


