భారత కుర్రాళ్ల జోరు

India beats Zimbabwe by 10 wickets - Sakshi

మౌంట్‌ మాంగనీ: అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వరుస రెండు విజయాలతో క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత్‌..తాజాగా జింబాబ్వేతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. తొలుత జింబాబ్వేను 154 పరుగులకే కుప్పకూల్చిన భారత్‌ జట్టు..ఆపై 21.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి సత్తాచాటింది. దాంతో హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత యువ జట్టు గ్రూప్‌-బిలో టాప్‌ ప్లేస్‌కు చేరింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్‌ చేసి 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మధవారే(30), షుంబా(36), నికోలస్‌ రోచ్‌(31)లు మాత్రమే మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాట్స్‌మెన్‌ తీవ్రంగా నిరాశపరిచారు. భారత స్పిన్నర్‌ అనుకుల్‌ రాయ్‌ నాలుగు వికెట్లు సాధించగా, అభిషేక్‌ శర్మ, అర్షదీప్‌ సింగ్‌లు తలో రెండు వికెట్లు తీశారు.

అటు తరువాత సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత జట్టు వికెట్‌ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లలో హార్విక్‌ దేశాయ్‌(56 నాటౌట్‌;73 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్‌) సమయోచితంగా ఆడగా, శుభ్‌మాన్‌ గిల్‌(90 నాటౌట్‌;59 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగిపోయాడు. దాంతో భారత్‌ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుని క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్దమైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top