ఆరు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు

IND VsAUS: Rahul, Dhawan Depart In Quick Succession After 121 Run Stand - Sakshi

ముంబై:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరితే, ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ కూడా సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. రాహుల్‌ హాఫ్‌ సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో ఆగర్‌ వేసిన బంతికి సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. ఆగర్‌ వేసిన 28 ఓవర్‌ తొలి బంతిని కవర్స్‌ మీదుగా తేలికపాటి షాట్‌ కొట్టాడు. కాగా, అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌ స్మిత్‌ దాన్ని క్యాచ్‌గా అందుకోవడంతో రాహుల్‌ హాఫ్‌ సెంచరీని తృటిలో మిస్సయ్యాడు. అంతకుముందు రోహిత్‌ శర్మ సైతం ఇదే తరహాలో ఔటయ్యాడు.

స్టార్ట్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతిని మిడాఫ్‌ మీదుగా ఆడటానికి రోహిత్‌ యత్నించాడు. కాగా, అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ చివరి నిమిషంలో క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తరుణంలో ధావన్‌కు జత కలిసిన రాహుల్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. వీరిద్దరూ ఆసీస్‌ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత్‌ స్కోరును ముందుకు నడిపించారు.  ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్‌(47; 61 బంతుల్లో 4 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

అయితే ఓపెనర్‌ ధావన్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ధావన్‌ 66  బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, ధావన్‌ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్‌ రెండు కీలక వికెట్లను కోల్పోయింది.  భారత్‌ 29 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: ఈసారి ‘సెంచరీ’ లేదు!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top