రిషభ్‌ పంత్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

IND Vs NZ: Mayank Agarwal, Rishabh Pant Shine In Draw - Sakshi

హామిల్టన్‌:ఈ మధ్య కాలంలో భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోవడానికే అపసోపాలు పడుతున్న యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ తర్వాత రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన రిషభ్‌.. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడో హాఫ్‌ సెంచరీ సాధించిన పంత్‌‌.. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అర్థ శతకం సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు చేశాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్‌ పంత్‌కు క్రీజ్‌లో పాతుకుపోవాలనే కసి కనిపించింది. దాంతో తొలుత నెమ్మదిగా ఆడిన పంత్‌.. ఆపై తనదైన శైలిలో ఆడాడు. ఫలితంగా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.(ఇక్కడ చదవండి: సూపర్‌ షమీ... భళా బుమ్రా...)

టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు పృథ్వీ షా(39;31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌(81 రిటైర్డ్‌ హర్ట్‌; 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన వీరిద్దరూ.. రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యాన్ని అందించారు.  ఈ రోజు ఆటలో మొదటి వికెట్‌గా పృథ్వీ షా ఔటైన తర్వాత ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌(8) మరోసారి విఫలయ్యాడు,. ఆ తరుణంలో మయాంక్‌కు జత కలిసిన రిషభ్‌ ఇన్నింగ్స్‌ను బాధ్యతాయుతంగా స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే అర్థ శతకం నమోదు చేశాడు. మూడో వికెట్‌కు 134 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత పంత్ ఔటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. మ్యాచ్‌ ముగిసే సమయానికి వృద్ధిమాన్‌ సాహా(30 నాటౌట్‌), అశ్విన్‌(16 నాటౌట్‌)లు అజేయంగా ఉన్నారు. అంతకుముందు భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో  263 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 235 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top