ధోనిని దాటేసిన ‘కెప్టెన్‌’.. కోహ్లి సరసన రోహిత్‌ | Sakshi
Sakshi News home page

ధోనిని దాటేసిన కోహ్లి.. కోహ్లి సరసన రోహిత్‌

Published Wed, Jan 29 2020 2:57 PM

IND VS NZ 3rd T20: Virat Kohli Register A Record As A Captain - Sakshi

హామిల్టన్‌: టీమిండియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఎంఎస్‌ ధోనిని సారథి విరాట్‌ కోహ్లి దాటేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో సారథిగా విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డును అధిగమించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా విరాట్‌ కోహ్లి మూడో స్థానానికి ఎగబాకాడు. ఇష్‌ సోధి వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నాలుగో బంతిని సింగిల్‌ సాధించడంతో కోహ్లి ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా తరుపున అత్యధికపరుగులు సాధించిన మాజీ సారథి ఎంఎస్‌ ధోని(1112) రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌(1273 పరుగులు), కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌(1148 పరుగులు)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ​

ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో కివీస్‌పై పేలవ రికార్డులు కలిగి ఉన్న రోహిత్‌కు ఇది ఉపశమనం కలిగించే అర్థ సెంచరీ. అది కూడా కేవలం 23 బంతుల్లోనే 5ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ సాధించడం విశేషం. ఇక ఇది రోహిత్‌కు 24వది కావడం విశేషం.  దీంతో టీ20ల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన ఆటగాడిగా సారథి విరాట్‌ కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో సిక్సర్‌ కొట్టడంతో రోహిత్‌ పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మట్లలో కలిపి పది వేల పరుగులు సాధించిన నాలుగో టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌ మరో ఘనత సాధించాడు. సునీల్‌ గవాస్కర్‌, సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఓపెనర్‌ రోహిత్‌ కావడం విశేషం.

చదవండి:
సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

‘ధోని సీటును అలానే ఉంచాం’

Advertisement
Advertisement