పొట్టి ఫార్మాట్లో రాణించాలంటే వయసుతో పనిలేదని భారత పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు...........
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో రాణించాలంటే వయసుతో పనిలేదని భారత పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. టి20ల్లో కుర్రాళ్లే బాగా ఆడతారనే ఇతరత్రా అంశాలను తాను నమ్మనని చెప్పాడు. ‘టి20 కుర్రాళ్ల ఆట అని చాలా మంది అంటున్నారు. ఇలాంటి సూత్రాలను నేను నమ్మను. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. మనకు ఫిట్నెస్ ఉన్నంతకాలం మంచిగా ఆడొచ్చు. ఓ బౌలర్గా నేను మంచి ప్రతిభను చూపెడుతున్నా. తొలి ఆరు ఓవర్లలో రెండు, మూడు వేస్తున్నా.
చివర్లో ఒకటి, రెండు ఓవర్లు వేయగలుగుతున్నా. చాలా చోట్ల ఫ్లాట్ వికెట్లు ఉంటున్నాయి. కాబట్టి ఓ బౌలర్గా మనం శారీరకంగా ధృడంగా, మానసికంగా బలంగా ఉండాలి’ అని నెహ్రా పేర్కొన్నాడు. ఐదేళ్ల తర్వాత జట్టులో చోటు లభించింది కాబట్టి... ఆసీస్తో టి20 సిరీస్లో రాణించడం తనకు అత్యవసరమన్నాడు. దీనివల్ల టి20 ప్రపంచకప్ రేసులో ఉండొచ్చని స్పష్టం చేశాడు.