ప్రతిభకు ‘పద్మా’భిషేకం | he fourth highest civilian award, the Padma Shri 'is announced | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ‘పద్మా’భిషేకం

Jan 26 2017 12:51 AM | Updated on Sep 5 2017 2:06 AM

అంతర్జాతీయ క్రీడా యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం పద్మాభిషేకం

న్యూఢిల్లీ: చేసింది. సంచలన క్రికెటర్, టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి సహా ఎనిమిది మందికి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’లను ప్రకటించింది. ఈ జాబితాలో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ పతక విజేతలు సాక్షి మలిక్, మరియప్పన్‌ తంగవేలు, దీపా మలిక్‌తో పాటు శేఖర్‌ నాయక్, వికాస్‌ గౌడ, దీపా కర్మాకర్, శ్రీజేశ్‌ ఉన్నారు.

కోహ్లి (క్రికెట్‌): సంచలనాల క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. ఇంటాబయటా... వేదికేదైనా... ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వేటగాడు మాత్రం అతడే. ఛేదనలో కొండంత లక్ష్యాన్ని సైతం పిండిచేయగల ఈ ‘రన్‌ మెషిన్‌’ ఇప్పుడు టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.  

సాక్షి (రెజ్లింగ్‌): రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన మహిళా రెజ్లర్‌ సాక్షి మలిక్‌. హరియాణాకు చెందిన సాక్షి 58 కేజీల బౌట్‌లో తన అద్వితీయ ప్రదర్శనతో కాంస్యాన్ని సాధించింది.

వికాస్‌ గౌడ (అథ్లెటిక్స్‌): కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో డిస్కస్‌ త్రో చాంపియన్‌ వికాస్‌. కర్ణాటకకు చెందిన వికాస్‌ రెండు  ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాడు.

మరియప్పన్‌ తంగవేలు (పారాథ్లెటిక్స్‌): ఈ పారాలింపియన్‌ ప్రతిభకు వైకల్యమే చిన్నబోయింది. తమిళనాడుకు చెందిన తంగవేలు రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌ టి42 కేటగిరీలో బంగారు పతకం సాధించాడు.

దీపా మలిక్‌ (పారాథ్లెటిక్స్‌): హరియాణాకు చెందిన దీపా మలిక్‌ రియో పారాలింపిక్స్‌ మహిళల షాట్‌పుట్‌ ఎఫ్‌–53 విభాగంలో అచ్చెరువొందించే ప్రదర్శనతో రజత పతకం గెలిచింది.

దీపా కర్మాకర్‌ (జిమ్నాస్టిక్స్‌): ఒలింపిక్స్‌కు అర్హత పొందిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన దీపా కర్మాకర్‌ రియోలో తృటిలో పతకం కోల్పోయింది. త్రిపురకు చెందిన ఈ మెరుపుతీగ వాల్టింగ్‌ ఈవెంట్‌లో తన ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి భారత అభిమానుల మనసుల్ని గెలుచుకుంది.

శ్రీజేశ్‌ (హాకీ): ప్రత్యర్థులు గోల్స్‌ చేయకుండా అడ్డుగోడలా నిలబడే గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌. కేరళకు చెందిన శ్రీజేశ్‌ భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని సారథ్యంలో భారత్‌ ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది.

శేఖర్‌ నాయక్‌ (అంధుల క్రికెట్‌): అంధుల ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ (2014)లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన నాయకుడు శేఖర్‌. కర్ణాటకకు చెందిన శేఖర్‌ తన ప్రదర్శనతో అలరిస్తున్నా ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement