
సాక్షి, గువాహటి: భారత్తో రెండో టీ 20 విజయానంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ కు వెళ్లే సమయంలో వారి బస్సుపై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని నలుగురు యువకులు తాగిన మైకంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అస్సాం డీజీపీ ముఖేష్ సాహయ్ మీడియాకు తెలిపారు. వీరి పూర్తి వివరాలను బయటపెట్టిన పోలీసులు వీరిలో ఇద్దరు మాత్రం 12వతరగతి చదువుతన్నట్లు, మరో ఇద్దరు షాప్లలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్టేడియం సమీప ప్రాంతంలో నివసించే ఈ నలుగురు మైనర్లేనని, ఆరోజు మ్యాచ్ను మొబైల్ ఫోన్లో చూశారన్నారు. ఓటమిని తట్టుకోలేక అటువైపు వస్తున్న ఆసీస్ టీం బస్సుపై నలుగురు రాయి విసిరారని, ఒక రాయి మాత్రం బస్సుకు తగిలినట్లు తమ విచారణలో వెల్లడైందని డీజీపీ తెలిపారు. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా చర్చజరగడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అస్సాం పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు.
అయితే ఈ విషయాన్ని తొలుత ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ క్రీడా అభిమానులు షాక్ గురయ్యారు. ఇలాంటి ఘటనలతో దేశ పరువు తీయవద్దని సోషల్ మీడియావేదికగా ఘాటుగానే స్పందించారు. అయితే ఈ ఘటనను ఆసరా చేసుకున్న పాక్ అభిమానులు భారత్పై తమ అక్కసును వెల్లగక్కారు. ఏకంగా భారత్లో క్రికెట్ మ్యాచ్లు నిషేదించాలని ఐసీసీకి సూచించారు.