శరణార్థికి స్వర్ణం... | Fahd Gold medal | Sakshi
Sakshi News home page

శరణార్థికి స్వర్ణం...

Aug 11 2016 1:59 AM | Updated on Sep 4 2017 8:43 AM

శరణార్థికి స్వర్ణం...

శరణార్థికి స్వర్ణం...

ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో తొలిసారి 10 మంది శరణార్థి క్రీడాకారులు ఒక జట్టుగా రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటుండగా...

 రియో డి జనీరో: ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో తొలిసారి 10 మంది శరణార్థి క్రీడాకారులు ఒక జట్టుగా రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటుండగా... ఇందులో ఒక శరణార్థి స్వర్ణ పతకాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. పురుషుల షూటింగ్ ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్స్ (ఐఓఏ) బృందానికి చెందిన ఫహద్ అల్ దిహాని పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. బుధవారం జరిగిన ఫైనల్లో ఫహద్ 26 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలువగా... మార్కో ఇనోసెంటో (ఇటలీ) 24 పాయింట్లతో రజతాన్ని సాధించాడు.
 
  టిమ్ నీల్ (బ్రిటన్-28 పాయింట్లు)తో జరిగిన కాంస్య పతక పోరులో స్టీవెన్ స్కాట్ (బ్రిటన్) 30 పాయింట్లు స్కోరు చేసి పతకాన్ని నెగ్గాడు. కువైట్‌కు చెందిన 49 ఏళ్ల ఫహద్‌కిది మూడో ఒలింపిక్ పతకం కావడం విశేషం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఫహద్ ‘డబుల్ ట్రాప్’లో... 2012 లండన్ ఒలింపిక్స్‌లో ‘ట్రాప్’లో కాంస్య పతకాలు గెలిచాడు. కువైట్ ఒలింపిక్ సంఘంలో రాజకీయ జోక్యం కారణంగా ఆ దేశంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం విధించింది. దాంతో ఫహద్ ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్ పతాకం కింద రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు.
 
 మన ఆశల పోటీలు నేటి నుంచి
 రియో డి జనీరో: ఒలింపిక్స్ ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా భారత్ పతకాల బోణీ చేయలేకపోయింది. కచ్చితంగా పతకం వస్తుందనుకున్న షూటింగ్‌లో ఇప్పటివరకూ పూర్తి నిరాశే మిగిలింది. అయితే భారత్‌కు కచ్చితంగా పతకాలు వస్తాయని భావిస్తున్న మరో మూడు ఈవెంట్లు నేటి నుంచి జరుగుతాయి. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌తో పాటు సింధు, శ్రీకాంత్ నేడు బరిలోకి దిగుతున్నారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జోడీ కూడా నేడు తమ తొలి మ్యాచ్ ఆడబోతున్నారు. 112 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లోకి వచ్చిన గోల్ఫ్‌కూ నేడు తెరలేస్తుంది. అనేక మంది టాప్ ఆటగాళ్లు రియోకు దూరంగా ఉన్నందున ఆసియా నంబర్‌వన్ అనిర్బన్ లాహిరిపై పతక అంచనాలు పెరిగాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement