ద్రవిడ్‌ వీడని కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌! | Dravid To Attend Before BCCI Ethics Officer In Conflict issue Again | Sakshi
Sakshi News home page

ద్రవిడ్‌ వీడని కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌!

Oct 31 2019 2:39 PM | Updated on Oct 31 2019 2:44 PM

 Dravid To Attend Before BCCI Ethics Officer In Conflict issue Again - Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కాన్‌ఫ్టిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం) సెగ వీడటం లేదు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ ఎథిక్స్‌ ఆఫీసర్‌  రిటైర్డ్‌ జస్టిస్‌ డీకే జైన్‌ ముందు హాజరైన ద్రవిడ్‌.. మరోసారి హాజరు కావాలంటూ తాజాగా నోటీసులు అందాయి. ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) డైరక్టర్‌గా ఉన్న ద్రవిడ్‌.. గత నెల 26వ తేదీన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై డీకే జైన్‌ ముందు హాజరయ్యారు. ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తాడంటూ మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన డీకే జైన్‌.. ద్రవిడ్‌ అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌గా ద్రవిడ్‌ ఉండటమే సంజీవ్‌ గుప్తా ఫిర్యాదుకు కారణం. కాగా, తాను ఇండియా సిమెంట్స్‌ను విరామం తీసుకున్నానని ద్రవిడ్‌ స్పష్టం చేసినప్పటికీ డీకే జైన్‌ మాత్రం మళ్లీ హాజరు కావాలంటూ నోటీసులు అందజేశారు. దాంతో నవంబర్‌ 12వ తేదీన మరొకసారి జైన్‌ ముందు ద్రవిడ్‌ హాజరు కానున్నాడు. ఇదిలా ఉంచితే, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ‘ఎన్‌సీఏ డైరెక్టర్‌ పదవో, మరేదైన క్రికెట్‌ జాబ్‌లేవీ శాశ్వతమైన ఉద్యోగాలు కావు. దీనికి ఓ శాస్త్రీయ పరిష్కారాన్ని కనుగొనాలి.  టీవీ వ్యాఖ్యానం, కోచింగ్‌ ఎలా పరస్పర విరుద్ధ ప్రయోజనాలవుతాయో నాకైతే అర్థం కావట్లేదు’ అంటూ గంగూలీ వ్యతిరేకించారు. ఇప్పుడు అధ్యక్ష హోదాలో గంగూలీ ఆ అంశాన్ని ఎలా డీల్‌ చేస్తోడో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement