సుశీల్, నర్సింగ్ వివాదాన్ని పరిష్కరించండి | Delhi High Court asks WFI to hear Sushil's plea | Sakshi
Sakshi News home page

సుశీల్, నర్సింగ్ వివాదాన్ని పరిష్కరించండి

May 18 2016 1:24 AM | Updated on Sep 4 2017 12:18 AM

ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

డబ్ల్యుఎఫ్‌ఐకు ఢిల్లీ హైకోర్టు సూచన
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. 74కేజీల విభాగంలో ఎవరిని గేమ్స్‌కు పంపాలనే సమస్యకు పరిష్కారం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ), సుశీల్ కలిసి తీసుకోవాలని సూచించింది. రియో ఒలింపిక్స్ సన్నాహక శిబిరంలో తన పేరు లేకపోవడం.. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్‌కు సమాఖ్య సుముఖంగా లేకపోవడంతో చివరి ప్రయత్నంగా సుశీల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

మంగళవారం దీనిపై విచారణ  జరిగింది. కేంద్ర క్రీడా శాఖ, డబ్ల్యుఎఫ్‌ఐ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ‘సుశీల్ గతంలో దేశం గర్వించదగ్గ విజయాలు సాధించాడు. అలా అని నర్సింగ్ యాదవ్‌ను తక్కువగా చేయలేం. అతడి కృషి వల్లే దేశానికి ఒలింపిక్ బెర్త్ దక్కింది. వ్యక్తిగతంగా ఒకరికి ఇబ్బంది ఎదురైనా.. దేశాన్ని మాత్రం అత్యున్నత స్థాయిలో నిలపాలి. చివరి ప్రయత్నంగా అయితేనే మేం జోక్యం చేసుకుంటాం. ముందుగా డబ్ల్యుఎఫ్‌ఐను నిర్ణయం తీసుకోనిద్దాం’ అని జస్టిస్ మన్మోహన్ అన్నారు. మరోవైపు సుశీల్ కుమార్, డబ్ల్యుఎఫ్‌ఐ మధ్య నేడు సమావేశం జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement