‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’ | Cummins Says Life Hasn't Changed Much Despite Record IPL Deal | Sakshi
Sakshi News home page

‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’

Jul 6 2020 10:07 AM | Updated on Jul 6 2020 10:10 AM

Cummins Says Life Hasn't Changed Much Despite Record IPL Deal - Sakshi

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ప్రధాన పేసర్‌  ప్యాట్‌ కమిన్స్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతన్ని 15.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కాగా, ఐపీఎల్‌ వేలం అతన్ని ఊరించి నిరాశకే గురి చేసి ఉండొచ్చు. ఇంకా ఐపీఎల్‌ ప్రారంభం కాకపోవడంతో కమిన్స్‌ కాస్త వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదంటూ తన మనుసులోని మాటను వెల్లడించాడు. ఐపీఎల్‌తో తన జీవితంలో పెద్దగా మార్పులేవీ వచ్చి పడలేదన్నాడు. ‘ నేను ప్రతీ  గేమ్‌ను ఆస్వాదిస్తా. అది టెస్టు ఫార్మాట్‌ అయినా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ అయినా నా గేమ్‌ ఒక్కటే. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఈ క్రమంలోనే వచ్చిన సక్సెస్‌లు కానీ, ప్రతికూల ఫలితాలు కానీ నన్ను పెద్దగా ప్రభావం చేయవు. నేను రెండింటిన ఒకేలా చూస్తా. దేనికీ పెద్దగా స్పందించను.. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ రెండింటిని ఒకేలా చూస్తా.  ఒక ఎత్తుకు ఎదిగి మళ్లీ కిందికి పడిపోయినా నిజంగా బాధపడను. ఐపీఎల్‌తో నా జీవితంలో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు’ అని కమిన్స్‌ అన్నాడు. పీటీఐతో ప్రత్యేకంగా ముచ్చటించిన కమిన్స్‌ పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు. (కోహ్లితో పెట్టుకోం!)

చాలా మంది క్రికెటర్లు టీ20 లీగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా కమిన్స్‌ పెదవి విప్పాడు.  ‘ నేను ఎప్పుడూ ఓల్డ్‌ బ్లాక్‌నే. నాకు టెస్టు ఫార్మాట్‌ అంటే చాలా ఇష్టం. సుదీర్ఘ ఫార్మాట్‌ను చూస్తూ పెరిగా. అందుకే ఆ ఫార్మాట్‌ అంటే నాకు చాలా ఇష్టం. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టు ఫార్మాట్‌కు ఎంతటి విలువ ఇస్తాడో అదే తరహాలో నేను కూడా ఆ ఫార్మాట్‌ను అత్యంత గౌరవంగా భావిస్తా. నాకు ప్రతీ టెస్టు మ్యాచ్‌ అత్యధిక సంతృప్తిని ఇస్తుంది. మేము క్రికెట్‌ను ఆరంభించానికి ఇంకా సమయం ఉన్నందుకు చాలా లక్కీ. ఇప్పటికే క్రికెట్‌ ప్రాక్టీస్‌ను ప్రారంభించా. టీ20 ఫార్మాట్‌ అనేది శారీరంగా సిద్ధం కావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇక మన జీవితంలో చిన్న చిన్న సర్దుబాటులు అనేవి సహజం. ఉద్యోగాల్లో కూడా అంతే. కానీ క్రీడల్లో సర్దుబాటుతో ఆడలేం. గేమ్‌లో ఎక్కువ సర్దుబాటు అనేది ఉండదని నా అభిప్రాయం’ అని కమిన్స్‌ తెలిపాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సి ఉండగా, కోవిడ్‌-19 కారణంగా అది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఇప్పటికైతే ఐపీఎల్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయినా ఆ లీగ్‌ జరుగుతుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిలో భాగంగానే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.(టి20 కోసం నా బ్యాటింగ్‌ మార్చుకునేవాడిని)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement