హ్యాట్రిక్‌ విజయాలతో టీ20 సిరీస్‌ కైవసం​.. | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ విజయాలతో టీ20 సిరీస్‌ కైవసం​..

Published Fri, Nov 15 2019 10:16 AM

Bowlers And Rodrigues Helps India Clinch T20I Series - Sakshi

గయానా: వెస్టిండిస్‌ మహిళలతో టీ20 సిరీస్‌ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. వరుసగా మూడో టీ20లో కూడా విజయం సాధించి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగా సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. తాజాగా జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ను 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 59 పరుగులకే కట్టడి చేసిన భారత్‌.. ఆపై 16.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా సిరీస్‌ను 3-0తో సాధించారు. వెస్టిండీస్‌ క్రీడాకారిణుల్లో చేదన్‌ నేషన్‌(11), హెన్రీ(11)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో రాధా యాదవ్‌, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు సాధించగా, అనుజా పటేల్‌, పూజా వస్త్రాకర్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో వికెట్‌ తీశారు.

60 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఓపెనర్ల వికెట్లను 13 పరుగులకే కోల్పోయింది. మంధాన(3), షెఫాలీ వర్మ(0)లు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి రెండు టీ20ల్లో ఇరగదీసిన వీరిద్దరూ.. మూడో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లను చేజార్చుకున్నారు. అనంతరం జెమీమా రోడ్రిగ్స్‌(40 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చింది. వెస్టిండీస్‌ మహిళలతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో భారత మహిళలు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement