ఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు మద్దతు | BCCI puts ICC events on the line | Sakshi
Sakshi News home page

ఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు మద్దతు

Jan 24 2014 1:02 AM | Updated on Sep 2 2017 2:55 AM

ఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు మద్దతు

ఐసీసీ పునర్‌వ్యవస్థీకరణకు మద్దతు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి సాధ్యమైనంత లబ్ధి పొందేలా బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

బీసీసీఐ వర్కింగ్ కమిటీ తీర్మానం
 చెన్నై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నుంచి సాధ్యమైనంత లబ్ధి పొందేలా బీసీసీఐ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా ఐసీసీ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల కమిటీ ముందుకు రాబోతున్న ప్రతిపాదనలను బోర్డు వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
 
 దీని ప్రకారం ఐసీసీలో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం తమతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు ఉండనుంది. గురువారం స్థానికంగా జరిగిన అత్యవసర వర్కింగ్ కమిటీలో ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ‘ఐసీసీ వర్కింగ్ గ్రూప్ ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చ జరిపాం. దీని ద్వారా భవిష్యత్‌లో క్రికెట్‌కు మంచి జరుగుతుంది’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.
 
 అలాగే ఐసీసీ కమర్షియల్ రైట్స్‌పై కూడా సభ్యులు చర్చ జరిపారు. ప్రస్తుతం ఐసీసీకి లభిస్తున్న ఆదాయంలో 75 శాతం... బోర్డు పది సభ్య దేశాలకు సమానంగా పంచుతుండగా, మిగిలినది అసోసియేట్ సభ్యులకు వెళుతోంది. అయితే ఇకపై క మర్షియల్ రైట్స్ (2015 నుంచి 2023 వరకు) నుంచి మాత్రం సింహభాగం తమకే దక్కాలని బీసీసీఐ కోరనుంది. ‘క్రికెట్‌లో మేం మమేకమైన తీరుతో పాటు మా నుంచి లభిస్తున్న అధిక ఆదాయానికి ఇది గుర్తింపుగా భావిస్తున్నాం. న్యాయపరమైన హక్కునే మా బోర్డు అడుగుతోంది. దీనివల్ల క్రికెట్ కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలుగదు’ అని సంజయ్ పటేల్ అన్నారు.
 
 శ్రీనివాసన్‌కు మాతృవియోగం
 బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తల్లి జయలక్ష్మి నారాయణస్వామి గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆవిడ వయసు 92 సంవత్సరాలు. మాతృ వియోగం కారణంగా శ్రీనివాసన్ బీసీసీఐ అత్యవసర వర్కింగ్ కమిటీ సమావేశానికి  హాజరు కాలేదు. దీంతో ఆయన స్థానంలో బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ కమిటీ సమావేశానికి నేతృత్వం వహించారు.
 
 ఏప్రిల్ 10నుంచి ఐపీఎల్ ?
 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏడో సీజన్ ఏప్రిల్ 10 నుంచి జరిగే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. ఏప్రిల్ 6న టి20 ప్రపంచ కప్ ముగుస్తుంది. 10 నుంచి ఐపీఎల్ నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.
 
 కింగ్స్ ఎలెవన్ సహాయక కోచ్‌గా బంగర్
 చండీగఢ్: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ సహాయక కోచ్‌గా నియమించుకుంది. 2014 సీజన్ కోసం ఈ నియామకం చేసినట్లు జట్టు ప్రకటించింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు భారత మాజీ క్రికెటర్ డబ్ల్యు.వి.రామన్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement