బంగ్లాదేశ్ లక్ష్యం 321
ఢాకా: స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం (5/62), మెహదీ హసన్ మిరాజ్ (3/48) విజృంభించడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. 139 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో తడబడింది. తైజుల్, మెహదీ ధాటికి 181 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మసకద్జా (48; 7 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. 321 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు లిటన్ దాస్ (14 బ్యాటింగ్), ఇమ్రుల్ కైస్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఫలితం రావడం ఖాయమైంది.