అక్సర్ క్యాచ్ తో పంజాబ్ ఆశలు సజీవం

అక్సర్ క్యాచ్ తో పంజాబ్ ఆశలు సజీవం

న్యూఢిల్లీ: క్రికెట్ లో క్యాచ్ పట్టడం, జారవిడచడంతో మ్యాచ్ ఫలితాలే మారిపోయే సందర్భాలెన్నో ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో మాత్రం దీని ప్రభావం మరి ఎక్కువ. క్యాచ్ జారవిడిచితే ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇక కింగ్స్ పంజాబ్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇలాంటిదే ఒకటి జరిగింది. పంజాబ్ ఆటగాడు అక్సర్ పటేల్ అద్భుత క్యాచ్ కు కోల్ కతా తగిన మూల్యం చెల్లించుకుంది. కోల్ కతా ఓపెనర్లు క్రిస్ లిన్- సునీల్ నరైన్ మంచి శుభారంభం అందించినా కోల్ కతా 14 పరుగుల తేడాతో ఓడింది.

 

దీనికి కారణం అక్సర్ క్యాచ్. రాహుల్ తెవాతియా వేసిన 10 ఓవర్లో అక్సర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. గౌతం గంభీర్ అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప వచ్చిరావడంతో భారీ షాట్ కు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి లేవడంతో అటుగా ఫీల్డింగ్ చేస్తున్న అక్సర్ పటేల్ పరిగెత్తుకుంటూ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఉతప్ప పరుగులు ఏమి చేయకుండా వెనుదిరిగాల్సి వచ్చింది.  ఇద్దరు ప్రధానమైన బ్యాట్స్ మెన్ లు వెను వెంటనే వెనుదిరిగారు. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న క్రిస్ లిన్ ను సైతం అక్సరే రనౌట్ చేయడంతో పంజాబ్ గెలుపు సుగమమైంది. ఈ ప్రదర్శనతో అక్సర్ మ్యాచ్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈ గెలుపుతో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు సజీవమయ్యాయి.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top