భారత్‌ సత్తాకు పరీక్ష  | Asia Cup football tournament today | Sakshi
Sakshi News home page

భారత్‌ సత్తాకు పరీక్ష 

Jan 10 2019 12:19 AM | Updated on Jan 10 2019 12:19 AM

Asia Cup football tournament today - Sakshi

అబుదాబి: తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 4–1తో చిత్తుగా ఓడించిన భారత ఫుట్‌బాల్‌ జట్టుకు ఆసియా కప్‌లో నేడు అసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా గురువారం ఆతిథ్య యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)తో భారత్‌ ఆడనుంది. యూఏఈ మాత్రం థాయ్‌లాండ్‌లా బలహీన జట్టేమీ కాదు. ర్యాంకింగ్స్‌లో కానీ, ఆటతీరులోగానీ భారత్‌ కంటే మెరుగ్గా ఉంది. అయితే బోణీ కొట్టిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ కనీసం ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా గ్రూప్‌ ‘ఎ’ నుంచి నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి.

భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. తన అనుభవంతో యూఏఈ మ్యాచ్‌లోనూ జట్టును ముందుండి నడిపిస్తే సానుకూల ఫలితం సాధించొచ్చు. మరోవైపు ప్రపంచ 79వ ర్యాంకర్‌ యూఏఈ తొలి మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో అతికష్టంమీద ‘డ్రా’ చేసుకుంది. దీంతో ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. యూఏఈలో మిడ్‌ఫీల్డర్‌ ఇస్మాయిల్‌ హమది, అహ్మద్‌ ఖలీల్‌ కీలక ప్లేయర్లు. ఖలీల్‌ తొలి మ్యాచ్‌లో జట్టుకు  కీలక గోల్‌ తెచ్చిపెట్టాడు. వీళ్లిద్దరిపై భారత డిఫెండర్లు దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు భారత్, యూఏఈ ముఖాముఖిగా 13 సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందగా... ఎనిమిదింటిలో యూఏఈ విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.    

Advertisement
 
Advertisement
Advertisement