అనిరుధ్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

Anirudh Pair Got Doubles Title - Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు నిక్కీ పూనాచ సత్తా చాటారు. ఉగాండాలోని కంపాలాలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్‌ విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన వీరిద్దరూ తమ హోదాకు న్యాయం చేస్తూ టైటిల్‌ను గెలుచుకున్నారు. టైటిల్‌పోరులో టాప్‌ సీడ్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌–నిక్కీ పూనాచ (భారత్‌) జంట 6–3, 6–4తో సిమోన్‌ కర్‌ (ఐర్లాండ్‌)–ర్యాన్‌ జేమ్స్‌ స్టోరీ (బ్రిటన్‌) జోడీపై వరుస సెట్లలో విజయం సాధించింది.

అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో  అనిరుధ్‌ చంద్రశేఖర్‌–నిక్కీ పూనాచ ద్వయం 6–2, 6–4తో మూడోసీడ్‌ సెర్గీ టోలోటోవ్‌ (రష్యా)–ఎస్‌డీ ప్రజ్వల్‌ దేవ్‌ (భారత్‌) జోడీపై సులువుగా గెలుపొందింది. క్వారర్‌ ఫైనల్లో అనిరు«ద్‌ జోడీకి గట్టి పోటీ ఎదురైంది. తొలి సెట్‌ను కోల్పోయిన అనిరు«ద్‌ జంట తర్వాత పుంజుకుంది.  ఈ మ్యాచ్‌లో 4–6, 6–3 (10/6)తో జులియన్‌ బ్రాడ్లీ (ఐర్లాండ్‌)–ఓర్లీ ఐరాడుకున్‌డ (బురుండి) జోడీపై నెగ్గి బరిలో నిలిచింది.  తొలి రౌండ్‌లో 6–2, 6–1తో తరుణ్‌ చిలకలపూడి–అభినవ్‌ సంజీవ్‌ (భారత్‌) జంటపై గెలుపొందింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top