చంద్రబాబును డిబార్‌ చేద్దాం

YSRCP MLA RK Roja Visit West Godavari - Sakshi

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా  

పశ్చిమగోదావరి, నల్లజర్ల(ద్వారకాతిరుమల): ఇతరుల పథకాలు కాపీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్రం నుంచి డిబార్‌ చేద్దామని, ఆయన కాలం చెల్లిన మాత్ర అని, దానివల్ల ప్రాణం ఎలా పోతుం దో, చంద్రబాబు మళ్లీ సీఎం అయితే రాష్ట్ర ప్రాణం కూడా అలాగే పోతుందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా తనదైన శైలిలో విమర్శించారు.  పంచాయతీలోని కమతం కుంటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణకు మంగళవారం విచ్చేసిన రోజా అనంతరం తెలికిచర్లలో జరిగిన ’నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు అనంతపల్లి నుంచి పార్టీ శ్రేణులు భారీ బైక్‌ ర్యాలీగా ఆమెను సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 

బాబుకు బుర్రలేదు
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. పాలనలో 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆలోచిం చే బుర్రలేదని ఎద్దేవా చేశారు. 47 ఏళ్ల వయస్సున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలను దొంగిలిస్తున్న దొంగ చంద్రబాబని విమర్శించారు. జగన్‌ నవరత్న పథకాలను కాపీ కొట్టి పాసవుదామని బాబు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

బాబు హామీలకు సింగపూర్‌ బడ్జెట్‌ కావాలి
చంద్రబాబు ఇచ్చే హామీలు నెరవేర్చాలంటే మన బడ్జెట్‌ సరిపోదని, సింగపూర్‌ బడ్జెట్‌ కావాలని రోజా వ్యంగ్యాస్త్రం సంధించారు. గత ఎన్నికల్లో డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానన్న బాబు అది చేయకపోగా ఇప్పుడు రూ.10 వేలు, స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తానని నమ్మబలుకుతున్నారని విమర్శించారు. పోస్ట్‌డేటెడ్‌ చెక్కులిచ్చి మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలను మోసగించేందుకు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.   

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తేనే మేలు
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని రోజా స్పష్టం చేశారు.  పిల్లల్ని బడికి పంపిస్తే అమ్మ ఒడి పథకం కింద సంవత్సరానికి రూ. 15 వేలు తల్లులకు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే పిల్లలు ఎంత చదివినా చదివించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అలాగే మద్యపాన నిషేధం, 45ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ,ఎస్టీ మైనారిటీ వర్గాల మహిళలకు  నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తారని వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి దేశంలో ఎక్కడా లేనటువంటి ఎన్నో సంక్షేమ ఫలాలను పేదలకు అందించారని రోజా గుర్తుచేశారు. ఆయన బాటలోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఆదుకునేందుకు నవరత్నాలతో జగనన్న మీ ముందుకొస్తున్నారని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ మార్గాని భరత్, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, రాజమండ్రి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు కవురు శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు చెలికాని రాజబాబు, కుప్పాల దుర్గారావు, నరహరశెట్టి రాజేంద్రబాబు, ఉభయ గోదావరి జిల్లాల మహిళా అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఏలూరు పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు సాయిబాల పద్మ, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఇళ్ల భాస్కరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి తొమ్మండ్రు రమేష్, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, నల్లజర్ల, గోపాలపురం, దేవరపల్లి మండలాల పార్టీ కన్వీనర్లు గగ్గర శ్రీనివాస్, పడమట సుభాష్‌ చంద్రబోస్, కూచిపూడి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top