‘పవన్‌ కల్యాణ్‌ ఎందుకు తోక ముడిచాడు’ | YSRCP Leader Pardha Saradhi Lashes Out At Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘పవన్‌ కల్యాణ్‌ ఎందుకు తోక ముడిచాడు’

Apr 4 2018 8:35 PM | Updated on Mar 22 2019 5:33 PM

YSRCP Leader Pardha Saradhi Lashes Out At Pawan Kalyan - Sakshi

సాక్షి, విజయవాడ : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మాజీమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌ రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పార్థసారధి బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్‌ఆర్‌ సీపీ రాజీలేని పోరాటం చేస్తోంది. నాలుగేళ్లు టీడీపీ భాగస్వామిగా వున్న పవన్కు వైఎస్‌ఆర్‌ సీపీ పోరాటం ఎలా కనబడుతుంది. అవిశ్వాసం పెట్టే దమ్ముందా అని పవన్‌ చేసిన సవాల్‌ను మా పార్టీ స్వీకరించింది. అంతేకాదు మా ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారు.  ఈ నెల 6న రాజీనామాల అనంతరం ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షం బాధ్యతతో చేస్తున్న ఉద్యమంగా పవన్ కల్యాణ్‌కు కనిపించడం లేదా?

ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడే టీడీపీతో మా పార్టీని ఎలా పోల్చుతారు?. ఆరు నెలలకు ఓసారి బైటకి వచ్చే పవన్‌కు రాష్ట్ర ప్రయోజనాల మీద ఏమేరకు చిత్తశుద్ధి వుంది?. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం కలిసి వచ్చే ప్రతి ఉద్యమ సంస్థకు మా మద్దతు ఉంటుందని వైఎస్‌ జగన్‌ గతంలోనే ప్రకటించారు. స్వయంగా వైఎస్సార్‌సీపీ యువభేరీలు, రహదారుల దిగ్బంధం, ఢిల్లీలో ధర్నాలు నిర్వహించింది. హోదా కోసం పవన్‌ కల్యాణ్‌ ఇప్పటివరకూ ఏం చేశారు?.  కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి. నేను కూడా ఢిల్లీకి వెళ్లి అన్ని పార్టీలను అవిశ్వాసం వైపు సహకారం కోరతాను అని పవన్‌ అన్నారు. మరి ఢిల్లీకి వెళ్లకుండా ఎందుకు ఉదాసీనంగా వున్నారో చెప్పాలి. తన పార్టనర్‌ టీడీపీని కాపాడేందుకు మళ్లీ యత్నిస్తున్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడుతానన్న పవన్‌ ఢిల్లీ వెళ్లకుండా పారిపోయారు.’ అని  పార్థసారధి ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement